Budget 2025: బడ్జెట్ భేటీకి సిద్దమైన కేంద్రం, విపక్షాలు-ఇద్దరి అజెండాలివే..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. అసలే మందగిస్తున్న ఆర్ధిక వ్యవస్ద, ఉరుముతున్న ట్రంప్.. ఎటు చూసినా సవాళ్లే కనిపిస్తున్న వేళ కేంద్రలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ ఏడాది సాధారణ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను సిద్ధం చేసుకుని పార్లమెంట్ సమావేశాల వేదికగా ఉక్కిరి బిక్కిరి చేసేందుకు విపక్ష ఇండియా కూటమి కూడా సిద్దమైంది. దీంతో రేపటి నుంచి హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరేంద్ర మోడీకి తొలిసారి బడ్జెట్ రూపంలో పెను సవాల్ ఎదురవుతోంది. దీనికి కారణం ఆర్ధిక వ్యవస్థ నెమ్మదించడమే. అలాగే భారతీయులపై ఉరుముతున్న ట్రంప్ ఎక్కడ టార్గెట్ చేస్తాడన్న భయం కూడా కేంద్రాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే భారతీయుల్ని వలసల పేరుతో తరిమేస్తుండటంతో ఆ ప్రభావం కచ్చితంగా కేంద్రం పై పడుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు ట్రంప్ ను అడ్డుపెట్టి మోడీని టార్గెట్ చేయబోతున్నాయి.

గతంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాలు నడిపి, బడ్జెట్లు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ కు ఇది తొలి మెజార్టీ లేని ప్రభుత్వ బడ్జెట్ గా మిగులబోతోంది. ముఖ్యంగా ఈసారి 240 సీట్లకే పరిమితమైన బీజేపీపై ఈ ఒత్తిడి బాగానే ఉంది. అదే సమయంలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట సైతం విపక్షాలకు రాజకీయంగా ఓ అస్త్రాన్ని అందించింది. మందగిస్తున్న ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, దేశంలో పెరుగుతున్న ప్రతికూలతను నియంత్రించాలన్నా మోడీకి ఈ బడ్జెట్ చాలా కీలకంగా మారింది.
ఇలాంటి పరిస్ధితుల్లో బడ్జెట్ జనరంజకంగా ఉండకపోతే మాత్రం విపక్షాల నుంచి విమర్శల దాడి తప్పకపోవచ్చని అంచనా.












Click it and Unblock the Notifications