parliament mansoon session day 2 : విపక్షాల నిరసనలతో ఉభయసభల వాయిదా-రేపు కేబినెట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా అవే దృశ్యాలు కనిపించాయి. తొలిరోజు అగ్నిపథ్, ధరల పెంపుపై కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన విపక్షాలు.. రెండోరోజు కూడా దాన్ని కొనసాగించాయి. దీంతో ఉభయసభల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశంకాగానే లోక్ సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష సభ్యులు కొన్ని కొత్త వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని సభ వెల్ లోకి వచ్చారు. ధరల పెరుగుదలపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులపై గబ్బర్ సింగ్ స్ట్రైక్స్ ఎగైన్ అని రాసి ఉంది. స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అయినా సభలో ప్లకార్డులు పట్టుకోవడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. సభలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతున్నందున సభ్యులు అందులో పాల్గొనాలని అన్నారు. కానీ విపక్షాలు మాత్రం శాంతించలేదు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం 2 గంటలకు వాయిదా పడింది. అయినా అదే పరిస్ధితి కొనసాగడంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్ధితి. అగ్నిపథ్ సహా ధరల పెరుగుదల వంటి అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే కేంద్రం అంగీకరించలేదు. ఆ తర్వాత సామూహిక విధ్వంస ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు, 2022 రాజ్యసభలో పరిశీలనకు తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. అయితే విపక్షాల నినాదాల మధ్య బిల్లు ఆమోదం పొందకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది.