Parliament Roundup Today:ఓబీసీ కులగణనకు కేంద్రం నో-రాజ్యసభలో ఓమిక్రాన్ చర్చ-లోక్ సభలో లఖీంపూర్ రచ్చ
పార్లమెంటు శీతాకాల సమవేశాలు ఇవాళ కూడా నిరసనల మధ్యే కొనసాగాయి. లోక్ సభలో యూపీలోని లఖీంఫూర్ ఖేరీ ఘటనపై తాజాగా వెలుగుచూసిన సిట్ నివేదికపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. అలాగే రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై ఎంపీలు నిరసనలకు దిగారు. అటు రాజ్యసభలో కేంద్రం ఓబీసీ జనాభా గణనపై మరోసారి క్లారిటీ ఇచ్చింది.
లోక్ సభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలోనే విపక్షాలు నిరసనకు దిగాయి. స్పీకర్ వారించడంతో కొద్దిసేపు శాంతించిన విపక్షాలు.. మళ్లీ నిరసనలకు దిగాయి. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై కారు పోనిచ్చిన ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందేనని సిట్ నివేదిక ఇవ్వడంతో దీనిపై చర్చుకు విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రం మాత్రం దీనికి నిరాకరించింది. దీంతో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఓసారి వాయిదా తర్వాత కూడా లోక్ సభ కార్యకలాపాలు కొనసాగలేదు. లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖ సహాయమంత్రి అమిత్ మిశ్రా తేనీ రాజీనమా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చివరికి విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

అటు రాజ్యసభలో సైతం ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా విపక్షాలు నిరసనకు దిగాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయింది. ఆ తర్వాత ఎంపీల సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని విపక్ష నేత ఖర్గే తో పాటు పలువురు విపక్ష ఎంపీలు కేంద్రాన్ని కోరారు. దీనిపై చర్చకు అనుమతించాలని విపక్షాలు కోరినా డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం కోవిడ్ 19 ఓమిక్రాన్ వైరస్ పై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్ష ఎంపీలు బూస్టర్ డోస్ ఇవ్వడం ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు.
అటు దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ... స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు.
ఇవాళ పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం
- ఇరుసభల్లోనూ జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం
- లోక్ సభలో లఖీంపూర్ ఘటనపై సిట్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ మిస్రా రాజీనామాకు విపక్షాల డిమాండ్
- విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభ రేపటికి వాయిదా
- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై చర్చకు విపక్షాల పట్టు
- రాజ్యసభలో కోవిడ్ 19 ఓమిక్రాన్ వైరస్ పై చర్చ
- ఓబీసీ జనగణన చేపట్టలేమని రాజ్యసభలో మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం












Click it and Unblock the Notifications