తెలంగాణపై అట్టుడికిన పార్లమెంట్ ఉభయసభలు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం బుధవారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. తొలుత వాయిదా పడిన ఉభయ సభల్లో పరిస్థితి తిరిగి సమావేశమైన తర్వాత కూడా మారలేదు. లోకసభను గందరగోళం మధ్యనే నడిపించడానికి స్పీకర్ మీరా కుమార్ ప్రయత్నించారు.
లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సేవ్ ఎపి అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా తెలంగాణ ఎంపీలు నినాదాలు చేశారు. ఇరు ప్రాంతాల సభ్యులు వెల్లో నినాదాలు చేశారు. స్పీకర్ సర్ది చెప్పినా వారు వినలేదు. ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నాలో ఉన్నారని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఆమె గొడవ మధ్యనే సుదీర్ఘంగా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడుతున్నారనేది కూడా స్పష్టం కాని పరిస్థితి ఏర్పడింది.

ఇదిలావుంటే, రాజ్యసభను రాష్ట్ర విభజన అంశం కుదిపేసింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత సభ్యులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకెళ్లారు. సభాధ్యక్షుడు ఎంతగా చెప్పినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో రాజ్యసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
ఢిల్లీలో అరుణాచల్ విద్యార్థి హత్యపై లోకసభలో స్పీకర్ మీరా కుమార్ చర్చను చేపట్టారు. దానిపై సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. ఢిల్లీలోని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థలకు తమ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారని ఆమె అన్నారు. గందరగోళం మధ్య చర్చ కొనసాగింది.
లోకసభలో తొలుత సంతాప తీర్మానాలు చేసిన తర్వాత సభ్యులు వివిధ అంశాలపై గొడవ ప్రారంభించారు. వివిధ అంశాలపై సభ్యులు గొడవ ప్రారంభించారు. దీంతో సభను స్పీకర్ తొలుత వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఉభయ సభలు తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. గొడవ కారణంగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడగా, లోకసభను స్పీకర్ మీరా కుమార్ రేపటికి వాయిదా వేశారు. కాగా, రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.


Click it and Unblock the Notifications