వ్యూహాలకు పదును: హోదా కోసం వైసీపీ గళమెత్తేనా? పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలొచ్చేశాయ్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ధారించారు. శీతాకాల సమావేశాల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేశారు. వచ్చే నెల 18 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీన్ని లోక్ సభ, రాజ్యసభ కార్యదర్శులకు పంపించింది. పార్లమెంట్ సంప్రదాయానికి అనుగుణంగా సుమారు నెల రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి.

మంత్రివర్గ భేటీలో షెడ్యూల్ ఖరారు..
శీతాకాల సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవలే సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పార్లమెంట్ భవనంలో ఈ భేటీ కొనసాగింది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీకి రాజ్ నాథ్ సింగ్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాల తేదీల నిర్ధారణపై రెండుసార్లు ఇప్పటికే ప్రత్యేక సమావేశాలను నిర్వహించింది. అనంతరం ఈ షెడ్యూల్ ను ఖరారు చేసింది. దీన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత..
అటు లోక్ సభ, రాజ్యసభల్లో భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మెజారిటీ సభ్యులు ఉన్నారు. ఫలితంగా- ఈ సారి కూడా వివిధ అంశాలపై చర్చలు ఏకపక్షంగా సాగిపోవడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించిన తరువాత పార్లమెంట్ సమావేశం కాబోతుండటం అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎవరి వ్యూహాల్లో వాళ్లు..
ఆర్టికల్ 370 రద్దు తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా పెరిగిపోతోన్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా దిగజారిపోవడం.. ఇలాంటి అంశాలను కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తోంది. 45 సంవత్సరాల తరువాత దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిదని, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందంటూ ఆ రంగానికి చెందిన మేధావి వర్గాలు కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి తోడు- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం ఎంపికైన అభిజిత్ బెనర్జీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఈ అంశం చుట్టే ప్రధానంగా చర్చ కొనసాగించవచ్చని తెలుస్తోంది.

బీజేపీ బలాలు వేరు..
ఆర్టికల్ 370 రద్దు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన, హౌడీ మోడీ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భారత్ సాధించిన విజయాలు వంటి అంశాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావించవచ్చు. జమ్మూ కాశ్మీర్ అంశం, పాకిస్తాన్ వైఖరి వంటి అంశాలతో పాటు అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు అంశం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకంపలను పుట్టించడానికి అవకాశం ఉంది. పార్లమెంట్ వచ్చే నెల 18వ తేదీ నుంచి ఆరంభం కానున్నందున.. ఈ లోగా అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువడించడానికి అవకాశం ఉంది. తీర్పు వెలువడటం, ఆ తరువాత సంభవించే పరిణామాలపై పార్లమెంట్ లో విస్తృతస్థాయిలో చర్చ జరిగడానికి అవకాశాలు లేకపోలేదు.

వైసీపీ వైఖరేంటీ?
పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయంటే అందరి చూపూ అధికార పార్టీ కేంద్రీకృతం కావడం ఖాయం. దీనికి అనుగుణంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలతో పాటు ప్రత్యేక హోదా డిమాండ్ ను వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో ప్రస్తావించవచ్చు. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమ గళాన్ని వినిపించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications