పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు... టైమింగ్స్ మార్పు... ప్రశ్నోత్తరాలు రద్దు... భగ్గుమంటున్న విపక్షాలు.
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి లోక్సభ సెక్రటేరియట్,రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి సమావేశాల నిర్వహణలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ,లోక్సభ వేర్వేరు షిఫ్టుల్లో సమావేశం కానున్నాయి. ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేయడం గమనార్హం.
ఉభయ సభల టైమింగ్స్ మార్పు...
సమావేశాల మొదటిరోజు లోక్సభ ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. రాజ్యసభ మధ్యాహ్నం 3గం. నుంచి రాత్రి 7గంటల వరకు జరగనుంది. సమావేశాల రెండో రోజు నుంచి చివరి రోజైన అక్టోబర్ 1 వరకూ లోక్సభ సమావేశాలు మధ్యాహ్నం 3గం. నుంచి రాత్రి 7గం. వరకు జరగనున్నాయి. అలాగే రాజ్యసభ సమావేశాలు ఉదయం 9గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నాయి. వారాంతాల్లోనూ ఉభయ సభల సమావేశాలు కొనసాగుతాయి.
ప్రశ్నోత్తరాలు రద్దు...
ఈసారి సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అలాగే ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ కూడా ఉండదు. జీరో అవర్ సమయంలో ఎంపీలు ప్రజా ప్రాముఖ్యమైన అంశాలను ప్రస్తావించవచ్చు. అయితే దీనికి కేవలం 30 నిమిషాలు మాత్రమే కేటాయించారు. సమావేశాలకు హాజరయ్యే ఎంపీలంతా కరోనా వైరస్ ప్రోటోకాల్ పాటించాలి. సమావేశాలకు 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ సర్టిఫికెట్తో వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తారు. ఉభయ సభల్లో భౌతిక దూరాన్ని పాటించేలా ఎంపీలకు స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేశారు.
భగ్గుమంటున్న విపక్షాలు...
మరోవైపు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరరూర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పార్లమెంట్ డెమోక్రసీకి ఆక్సిజన్ లాంటిదని అభిప్రాయపడ్డారు. కరోనాను సాకుగా చూపి అసమ్మతి స్వరాన్ని వినిపించకుండా ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని తాను నాలుగు నెలల క్రితమే చెప్పానని గుర్తుచేశారు. కేవలం కరోనాను సాకుగా చూపి ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని ఎలా సమర్థించుకోగలరని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పార్లమెంటును నోటీసు బోర్డు స్థాయికి కుదించేందుకు ప్రయత్నిస్తోందని... తమకున్న మెజారిటీని రబ్బర్ స్టాంప్లా ఉపయోగించుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని...
ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రియెన్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కరోనా ఓ సాకుగా ఉపయోగించబడిందన్నారు. 'ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను లేవనెత్తేందుకు సభ్యులు 15 రోజుల ముందుగానే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రశ్నోత్తరాలను ఎందుకు రద్దు చేసినట్లు... దీని ద్వారా విపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోనున్నారు. 1950 నాటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ఇదో సాకు అని అభిప్రాయపడ్డారు.