కొందరు మాజీ ప్రధానులు..: పారికర్ సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశ భద్రతకు సంబంధించిన పలు వ్యూహాత్మక అంశాల్లో గోప్యత పాటించడంలో కొందరు మాజీ ప్రధానులు రాజీపడ్డారని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వారి పేర్లను మాత్రం చెప్పలేదు.
పారికర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని పేర్కొంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని నిలదీసింది. లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
గురువారం నాడు జాతీయ భద్రతకు సంబంధించిన హిందీ వారపత్రిక వివేక్ ప్రచురించిన ప్రత్యేక సంచికను ముంబైలో పారికర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ విషయమై తాను వివరాలు చెప్పలేనని తెలిపారు.
దేశ భద్రతకు సంబంధించి వ్యూహాత్మక అంశాలను సృష్టించుకునేందుకు ఇరవై ముప్పై ఏళ్ల సమయం పడుతుందన్నారు. బాధాకరమైన విషయమేమంటే.. అలాంటి వ్యూహాత్మక అంశాలను కాపాడటంలో కొందరు మాజీ ప్రధానులు విఫలమయ్యారన్నారు. అయితే వారి పేర్లను తాను వెల్లడించలేనని, చాలామంది ప్రజలకు ఆ విషయం తెలుసునన్నారు.
మనోహర్ పారికర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ.... పారికర్ వివరణ ఇవ్వాలన్నారు. మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆ జాబితాలో ఎన్డీయే ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఉన్నారా అని ప్రశ్నించారు.