'పార్టీ' మెలిక: త్వరలో షాకింగ్.. శశికళనే ముఖ్యమంత్రి, పన్నీరు త్యాగంపై..
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ త్వరలో సీఎం పీఠం కూడా ఎక్కనున్నారా? త్వరలో తమిళనాట సంచలనం జరగనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ త్వరలో ముఖ్యమంత్రి పీఠం కూడా ఎక్కనున్నారా? త్వరలో తమిళనాట సంచలనం జరగనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!
జనరల్ సెక్రటరీయే సీఎంగా ఉంటారు
ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహజంగా తమ పార్టీలో పార్టీ ప్రధాన కార్యదర్శియే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత కూడా అలాగే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు శశికళను కూడా అలాగే చూడాలనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి.. ఒక్కరే అయితే బాగుంటుందని సీఆర్ సరస్వతి అన్నారు. ఇప్పుడు శశికళ పార్టీ అధినేత్రిగా ఉన్నారని, ముఖ్యమంత్రిగా కూడా ఆమె అయితే బాగుంటుందన్నారు.
పన్నీరు సెల్వం.. త్యాగం మాటకు అర్థం లేదు
నిన్న జయలలిత కోసం, నేడు శశికళ కోసం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన పదవిని త్యాగం చేయాలా అని ప్రశ్నించగా.. తమ పార్టీలో త్యాగం అనే మాటకు అర్థం లేదన్నారు. అందరీ పార్టీ కార్యకర్తలే అన్నారు. నిన్న అమ్మ, ఇప్పుడు చిన్నమ్మ ఎంత చెబితే అంత అని అభిప్రాయపడ్డారు.
పన్నీరు సెల్వం చాలా మంచివారు అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు అన్నారు. నిన్న అమ్మ ఏం చెబితే అదే చేసేవారు అన్నారు. ఆయనకు జయలలిత అంటే అభిమానం అన్నారు. పార్టీకి ఏం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే అది చేసేందుకు ఆయన సిద్ధంగా ఉంటారన్నారు. కాబట్టి సీఎం పదవి విషయంలో పన్నీరు సెల్వంది త్యాగం అనకూడదన్నారు.
చిన్నమ్మ చెప్పాలి, దేవుడు చెప్పాలి
శశికళ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారంటే.. అది చిన్నమ్మ చెప్పాలి, అలాగే దేవుడు చెప్పాలన్నారు. కాగా, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను ఈ రోజు నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెనే భావి సీఎంగా పార్టీ క్యాడర్ భావిస్తోంది.
కాగా, శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా, శాసనసభపక్ష నేతగా... తద్వారా ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకుంటామని మంత్రి సెల్లూరు రాజు అంతకుముందే ప్రకటించారు.
పార్టీ అధినేత్రి జయలలిత కన్నుమూతతో పార్టీ పలు ఇక్కట్లను ఎదుర్కొంటోందన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితిలో పార్టీని క్రమశిక్షణతో శశికళ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సెల్లూరు రాజుతో పాటు పలువురు మంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.