రైల్వే శాఖను హడలెత్తిస్తున్న ‘దొంగ’ ప్రయాణికులు: ఏటా రూ. వేల కోట్ల విలువైన టవల్స్, బ్లాంకేట్లు....!
న్యూఢిల్లీ: ప్రయాణికులే దేవుళ్లని భావించే సంస్థలకు వారి నుంచే రక్షణ లేకుండా పోతోంది. భారత రైల్వే ప్రయాణికుల వ్యవశైలితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏ ఆందోళన జరిగినా రైళ్లపై, రైల్వే విభాగం ఆస్తులపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో తలనొప్పి భారత రైల్వేకు వచ్చింది.
రైల్వే ప్రయాణికులే రైళ్లలోని బ్లాంకెట్లు, దిండ్లు, బెడ్ షీట్లు, టవల్స్, తదితర వస్తువులు దొంగలించుకుపోవడం విచారకరం.
‘దొంగ'ప్రయాణికులు
రైల్వే ప్రయాణికులే రైళ్లలోని బ్లాంకెట్లు, దిండ్లు, బెడ్ షీట్లు, టవల్స్, తదితర వస్తువులు దొంగలించుకుపోవడం విచారకరం. ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే 1.95లక్షల టవల్స్, 81,736 బెడ్షీట్లు, 55,573 దిండ్ల కవర్లు, 5,038 దిండ్లు, 7,043 బ్లాంకేట్లు ప్రయాణికులే చోరీ చేయడం గమనార్హం.
టవెల్స్, బెడ్ షీట్లు, బ్లాంకేట్లు లక్షల సంఖ్యలో..
సెంట్రల్ రైల్వేస్ సీపీఆర్ఓ సునీల్ ఉదాసి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 62లక్షల విలువైన 79,350 చేతి రుమాళ్లు, 27,545బెడ్ షీట్లు, 21,050 దిండ్ల కవర్లు, 2,150 దిండ్లు, 2,065 బ్లాంకేట్లు చోరీకి గురయ్యాయని తెలిపారు.
రూ. 2.5కోట్ల వస్తువుల చోరీ.. ఒక్క ‘దొంగ'ను పట్టుకున్నారు..
ఈ వారం ముందు రోజు బాంద్రా టెర్మినస్ నుంచి వచ్చిన సబ్బీర్ రోటివాలా అనే రాట్లం వాసిని.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఆరు బెడ్ షీట్లు, మూడు దిండ్లు, మూడు బ్లాంకేట్లను దొంగిలించాడు. ఏసీ కోచ్లో ప్రయాణించిన ఇతడు దొంగిలించిన వస్తువులతో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరం రూ. 2.5 కోట్లు విలువైన వస్తువులు దొంగిలించడబడ్డాయి. మరిన్ని ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఒక్కో బెడ్ షీట్ ధర రూ.132 కాగా, టవెల్స్ ధర రూ.22, దిండు ధర రూ. 25.
3ఏళ్లలో రూ.4వేల కోట్ల విలువైన వస్తువుల చోరీ, ఆస్తుల ధ్వంసం.. బాధ్యత?
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారత రైల్వే సుమారు రూ.4,000కోట్ల విలువైన సొత్తును కోల్పోయింది. ఇందులో మేజర్ వాటా ప్రయాణికుల దొంగతనాలే కావడం గమనార్హం. గత సంవత్సరం తేజస్ ఎక్స్ప్రెస్లో టికెట్ను రూ.1,185 కొనుగోలు చేసిన ప్రయాణికులు టాయ్లెట్స్లోని జాగ్వార్ ఫిట్టింగ్ను దొంగతనం చేశారు. హెడ్ ఫోన్స్ కూడా చోరీ చేశారు. అంతేగాక, ఎల్ఈడీ స్కీన్లను ధ్వంసం చేశారు. గత నెల ముంబై-మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్ రైలు రిపేర్లకు రూ.9లక్షలు ఖర్చు కావడం గమనార్హం. దీనికి ప్రయాణికుల విధ్వంసమే కారణం. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ ఆధునాతన సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం వాటిని చక్కగా ఉపయోగించడం మాని ధ్వంసం చేస్తూ రైల్వే శాఖకు తీరని నష్టం చేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ ఖర్చుల భారం పెరిగిపోతోంది. ఇలా తరచూ జరుగుతుంటే రైల్వే శాఖ ఛార్జీలను కూడా పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని రైల్వే శాఖ కోరుతోంది.