దారుణం... కరోనా సోకిన భార్య తల నరికిన భర్త... ఆపై అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య...
బిహార్లో దారుణం జరిగింది. కరోనా సోకిన ఓ మహిళను ఆమె భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఆమె తల నరికి హతమార్చాడు. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనాపై లేని పోని అపోహలు,భయాందోళనతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
భర్త రైల్వే ఉద్యోగి... భార్య మెడికల్ స్టాఫ్..
పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలో ఉన్న ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో అతుల్ లాల్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతుల్ లాల్ రైల్వే ఉద్యోగి కాగా... అతని భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతని భార్యకు కరోనా టెస్టుల్లో పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన అతుల్ లాల్... భార్య ఇంటికి రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. తల నరికి హతమార్చాడు.
హత్య తర్వాత భర్త ఆత్మహత్య...
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి... అతుల్ లాల్ అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కరోనాపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది పేషెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ చాలామంది కరోనా పేషెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరోనా రెండో వేవ్ నాటికి కూడా దీనిపై ప్రజల్లో సరైన అవగాహన ఏర్పడకపోవడంతో అనవసర భయాందోళనలు,అపోహలతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే విలవిల...
ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ దాదాపు 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మే మధ్య వారం నాటికి దేశంలో కరోనా కేసులు పీక్స్కి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఉత్తరప్రదేశ్లో రోజుకు 1.19లక్షల కరోనా కేసులు,మహారాష్ట్రలో 99వేల కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రులు కిక్కిరిసిపోయి... పేషెంట్లకు ఆక్సిజన్ అందక.. చాలాచోట్ల హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూపీ లాంటి రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లతో కోవిడ్ పేషెంట్ల బంధువులు ఆక్సిజన్ ప్లాంట్ల ఎదుట బారులు తీరుతున్నారు. ఇక కేసులు పీక్స్కి చేరుకుంటే మన హెల్త్ కేర్ వ్యవస్థ తట్టుకుంటుందా.. ఇంకెంత విషాదాన్ని చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
Recommended Video