కాంగ్రెస్ వల్ల ఎపి చీలింది, విసుగొచ్చే: కర్నాటకలో పవన్
బెంగళూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తరఫున తొలిసారి కర్నాటక రాష్ట్రంలోని కోలార్లో సోమవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ పైన దుమ్మెత్తి పోశారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు ఈలలు వేసి కేరింతలు కొట్టారు.

తాను సినిమాల ప్రచారం కోసం ఎప్పుడు కోలార్కు రాలేదన్నారు. తన సినిమాలను నచ్చితే చూస్తారు లేదా నచ్చకుంటే వదిలేస్తారని కానీ, ఇప్పుడు ప్రజల కోసమే తాను వచ్చానన్నారు. కులానికి, మతానికి అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానన్నారు.
అందుకే మోడీకి మద్దతు పలికానని చెప్పారు. సుస్థిర ప్రభుత్వం కోసమే మోడీకి మద్దతు పలికానన్నారు. తాను సినిమా డైలాగులు చెప్పేందుకు రాలేదన్నారు. సమాజంలో వెనుకబాటుతనం చూడలేకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాంగ్రెసు పార్టీ వల్లే తెలుగు జాతి రెండుగా చీలిందన్నారు. దేశ సమగ్రతను ఎలా కాపాడాలో కన్నడిగులు స్ఫూర్తి అన్నారు. కన్నడిగుల స్ఫూర్తిని తాను తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు చెబుతానన్నారు.
దేశ సమగ్రత ఎలా పాటించాలో కన్నడ ప్రజలకు బాగా తెలుసునన్నారు. తనకు కాంగ్రెసు పార్టీ పైన వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదన్నారు. పదేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెసు ఏమీ చేయలేదన్నారు. అది తనకు విసుగు కలిగించిందన్నారు. అందుకే తాను నరేంద్ర మోడీకి మద్దతు పలికానన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని మరిచిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications