రంగంలోకి పవన్ కళ్యాణ్: చిక్కబళ్లాపురలో ప్రచారం
బెంగళూర్: జనసేన అధినేత, ప్రముఖ తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ బిజెపి తరఫున ప్రచార రంగంలోకి దూకుతున్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఆయన ప్రచారం చేయనున్నారు ఈ విషయాన్ని బిజెపి అభ్యర్థి బచ్చెగౌడ చెప్పారు. త్వరలోనే ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారని ఆయన చెప్పారు.
ఈ నెల 13వ తేదీన తమ పార్టీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడితో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గంలో వీరప్ప మొయిలీకి, కుమార స్వామికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, అయినా తానే గెలుస్తానని ఆయన అన్నారు.

రామనగర్ తన జన్మస్థలమని, దాన్ని వదులుకోబోనని కుమారస్వామి చెప్పారని, ఏడాది కాక ముందే దాన్ని వదిలేసి లోకసభ అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దిగిన కుమారస్వామిని ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. తాను తప్ప మరొకరు లోకసభ ఎన్నికల్లో పోటీ చేయబోరని చెప్పిన జెడిఎస్ నేత దేవెగౌడ మాట తప్పారని ఆయన విమర్శించారు.
నామినేషన్ల దాఖలుకు ముందు అనితా కుమార స్వామి పేరు ముందుకు వచ్చిందన, అభ్యర్థిని కుమారస్వామిగా ఎందుకు మార్చారో తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications