బిజెపి హిందువుల పార్టీ కాదని మోడీతో పవన్ కళ్యాణ్!
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాదని, ముస్లింలకు అభద్రతా భావం ఉండవద్దని తాను గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అడిగానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు.
పవన్ కళ్యాణ్ బిజెపి తరఫున కర్నాటక రాష్ట్రంలోని కోలార్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మతాలకు, కులాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని తాను మోడీకి చెప్పానన్నారు. సభ అనంతరం కాంగ్రెసు హఠావో అంటూ పవన్ నినాదాలు చేయించారు. కాంగ్రెసు హఠావో అని కన్నడ భాషలో నినాదం చేయడంతో పాటు.. హాజరైన ప్రజలతో చేయించారు.

కష్టం నష్టం తెలిసిన మోడీ లాంటి నేత దేశానికి కావాలన్నారు. సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్లని తాను మోడీని ప్రధానిని చేసేందుకు ప్రచారం చేస్తున్నానని అన్నారు. మంచి సిద్ధాంతాల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తానని తెలిపారు. ఓటమితో ప్రపంచం నాశనం కాదని, ఓడినా, గెలిచినా నాయకుడనేవాడు మొండిగా ముందుకే సాగాలని పవన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయిందని, నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిందని ఆయన మండిపడ్డారు. తాను కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న సమస్యలపై నేతలను నిలదీస్తానని అన్నారు. కాగా, పవన్ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు కేరింతలు కొట్టారు.












Click it and Unblock the Notifications