'నగదు' కనుమరుగవుతుంది: జైట్లీ, ఐటీ 'కొత్త' షాక్.. ప్రకటిస్తే 50%, పట్టుకుంటే 85%
పెద్ద మొత్తంలో నగదు తీసుకు వెళ్లే విధానం సమీప భవిష్యత్తులో కనుమరుగు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు.
న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో నగదు తీసుకు వెళ్లే విధానం సమీప భవిష్యత్తులో కనుమరుగు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు. జేబులో డబ్బులు లేకుండా వెళ్లడం సులభతరమని, ప్రతిసారి డబ్బులు తీసుకెళ్లకుండా మొబైల్ వాలెట్ వెంట తీసుకెళ్లడం మంచిదని సూచించారు.
రాబోయే రోజుల్లో ఈ - వాలెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాప్ లాంచింగ్ కార్యక్రమంలో జైట్లీ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తు అంతా ఈ-వాలెట్, మొబైల్ బ్యాంకింగ్లదే అన్నారు.
నోట్ల రద్దు: నల్లకుబేరులకు మరో ఛాన్స్, ఐటీ సవరణ బిల్లు, ఇదీ లెక్క..
దీని వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే కొద్ది మొత్తంలో తప్పితే పెద్ద మొత్తంలో చేతిలో కరెన్సీ ఉంచుకునే పని ఉండదని చెప్పారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ డిజిటల్ పేమెంట్స్లోనే జరుగుతాయన్నారు.
వినియోగం పెరిగితే క్రెడిట్, డెబిట్ కార్డుల సర్వీసు చార్జీలు తగ్గించే అవకాశముంటుందన్నారు. కార్డుల ద్వారా చెల్లింపులకు సంబంధించిన సర్వీస్ చార్జీలను డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. డెబిట్ కార్డుల వినియోగం పెరిగితే సర్వీసు చార్జీలు తగ్గుతాయన్నారు.
రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఆదాయ పన్ను బిల్లులోని సవరణలు
సోమవారం అరుణ్ జైట్లీ సభలో ఆదాయ పన్ను సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. వివరాలు ఇవీ..
లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తే వారి వద్ద నుంచి 50 శాతం పన్ను కింద వసూలు చేస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రం వద్ద ఉంటుంది. ఈ 50 శాతంలో వెంటనే 25శాతం, నాలుగేళ్ల తర్వాత మరో 25 శాతం ఇస్తారు. 30శాతం పన్ను, పది శాతం పెనాల్టీలపై 33శాతం సర్ఛార్జి విధిస్తే దాదాపు 50 శాతం పన్ను అవుతుంది. మరో విషయం ఏమిటంటే... ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఏ ఏడాది కూడా ఆదాయపన్ను డిక్లరేషన్లో చూపించరాదు. డిసెంబర్ 30వ తారీకు వరకు ఈ అవకాశం ఉంటుంది.
తమ వద్ద ఉన్న ధనాన్ని ఎవరైనా అధికారికంగా వెల్లడించకుండా, అధికారుల దాడుల్లో నల్ల ధనం పట్టుబడితే దానిపై ఫ్లాట్ 60 శాతం పన్ను, ట్యాక్స్లో 25 శాతానికి సర్ఛార్జి (15 శాతం) మొత్తం దాదాపు 75 శాతం పోతుంది. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10 శాతం పెనాల్టీ వేయాలని నిర్ణయించే అవకాశముంది. అంటే 85 శాతం డబ్బు పోతుంది. అతనికి 15 శాతం మాత్రమే మిగలొచ్చు.
ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు మళ్లించి దేశంలో వివిధ పేదరిక నిర్మూలన పథకాలు చేపట్టనున్నారు. కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది.
రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లలో ఇప్పటివరకు దాచిన అక్రమార్జనను ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన 2016 కింద వెల్లడించాలనుకునేవారు ఆ మొత్తంపై 30 శాతం పన్ను చెల్లించాలి.
నల్లధనాన్ని ప్రకటించిన వారు ఆ మొత్తంలో 25 శాతం పేదరిక నిర్మూలన పథకానికి ఉద్దేశించిన డిపాజిట్ పథకంలో తప్పనిసరిగా జమ చేయాలి. దానిపై వడ్డీ ఉండదు. నాలుగు సంవత్సరాల పాటు ఈ మొత్తాన్ని బయటకు తీసుకోవడానికి వీలుండదు. ఈ పథకాన్ని ఆర్బీఐ నోటిఫై చేస్తుంది.
న్యాయం, సమానత ఉండేలా సాగునీరు, గృహనిర్మాణం, మరుగుదొడ్లు, మౌలికసదుపాయాలు, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, జీవనోపాధి తదితర రంగాల్లోని ప్రాజెక్టులకు ఈ డబ్బును ఉపయోగించనున్నారు.