ప్రజలే సుప్రీం: ప్రధాని మోడీకి నితీశ్ కుమార్ ధన్యవాదాలు, తొలి స్పందన ఇదే
పాట్నా: బీహార్ రాష్ట్రంలో మరోసరి ఎన్డీఏ విజయాన్ని నమోదు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తొలిసారి స్పందించారు. ఎన్డీఏ విజయానికి ఎంతో కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే సుప్రీం అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టిన బీహార్ రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 110 స్తానాల్లో గెలుపును నమోదు చేసింది. ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందగా, ఎల్జేపీ ఒక స్థానంలో విజయం సాధించింది.
ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని బీజేపీ స్పష్టం చేసింది. దీనిపై కొంత అనుమానాలు మొదలైన నేపథ్యంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగానే తమ ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ స్పష్టం చేశారు.
కాగా, బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోడీ ప్రసంగించారు. బీజేపీ పట్ల యువకులంతా చాలా నమ్మకంతో ఉన్నారని.. దళితులు,బీసీలు,ప్రతీ వర్గం బీజేపీని విశ్వసిస్తోందని చెప్పారు. ఒక్క బీజేపీ మాత్రమే పేదలు,మహిళల కోసం పనిచేస్తోందన్నారు.
బీహార్లో మూడుసార్లు అధికారం చేపట్టిన పార్టీ బీజేపీనే అని చెప్పారు. తాజా బీహార్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారన్నారు. నితీశ్ నాయకత్వంలో బీహార్లో మరింత అభివృద్ది సాధిస్తామన్నారు. బీజేపీకి స్థిరమైన సైలెంట్ ఓటర్లు ఉన్నారని... వాళ్లు మహిళా ఓటర్లు అని మోడీ తెలిపారు. ప్రతీ ఎన్నికల్లోనూ మహిళలు తమవెంటే నిలుస్తున్నారని చెప్పారు. జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటివరకూ కరోనా మహమ్మారిపై చేస్తూ వచ్చిన పోరు ఎన్నికల్లో ప్రతిఫలించిందన్నారు.