మతాన్ని బట్టి సమాజాన్ని విడదీసే బిజెపి ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు ఓడించారు : సోనియా గాంధీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి అధికారాన్ని కైవసం చేసుకుంది. జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో 47 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. ఇక జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మతాన్ని బట్టి సమాజాన్ని విభజించడానికి బిజెపి చేసిన ప్రయత్నాలను ప్రజలు ఓడించారు అని జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి సోనియా గాంధీ పేర్కొన్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో జెఎంఎం-కాంగ్రెస్-ఆర్జెడి కూటమి విజయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రాధాన్యత సంతరించుకుంది అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. కుల, మత పరంగా సమాజాన్ని విభజించే బిజెపి ప్రయత్నాలను ప్రజలు ఓడించారని ఆమె గట్టిగా పేర్కొన్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని పీపుల్ సెంట్రిక్ కాంగ్రెస్-జెఎంఎం-ఆర్జెడి కూటమిపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు సోనియాగాంధీ జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయానికి హేమంత్ సోరెన్, అన్ని కూటమి భాగస్వాములు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను సోనియా గాంధీ అభినందించారు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని , ఇప్పుడు అవసరం అని పేర్కొన్న సోనియా గాంధీ బిజెపిని మరియు దాని విభజన ఎజెండాను ఓడించినందుకు జార్ఖండ్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు అంటూ ఆమె హర్షం వ్యక్తం చేశారు.