పోయెస్ గార్డెన్లో ఆ రోజేం జరిగింది?: జయను తోసేసి.. శశికళపై సంచలనం
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 22వ తేదీన ఏం జరిగింది? పోయెస్ గార్డెన్లో గొడవ జరిగిందా? ఎవరో జయను నెట్టివేయడం వల్లే ఆమె ఆసుపత్రి పాలయ్యారా?
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 22వ తేదీన ఏం జరిగింది? పోయెస్ గార్డెన్లో గొడవ జరిగిందా? ఎవరో జయను నెట్టివేయడం వల్లే ఆమె ఆసుపత్రి పాలయ్యారా? ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారాయి.
అన్నాడీఎంకే నాయకులు, మాజీ స్పీకర్ పిహెచ్ పాండియన్, మరికొందరు సీనియర్ నేతలతో కలిసి మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన ఏదో జరిగిందని అనుమానించారు. దీనిపై ఆయన మాట్లాడారు.
జయ గురించి శశికళ చాలా దాచారు: విషప్రయోగం సీనియర్ అనుమానం
ఆయన వ్యాఖ్యలతో జయలలిత మృతిపై మళ్లీ అనుమానాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22న ఏదో జరిగిందంటూ.. ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఆ రోజున పోయెస్ గార్డెన్లో ఏదో గొడవ జరిగిందని పాండియన్ అన్నారు. జయలలితను ఎవరో నెట్టివేశారని, అప్పుడు ఆమె కిందపడిపోయారని చెప్పారు. అప్పుడు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు.
ఎవరో తోసేశారు
ఆమెను ఎవరో తోసివేయడం, ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రిలో చేర్చడం.. ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరిగిందనే అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. విషప్రయోగం జరిగిందా అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు.
శశికళ సీఎం కావడం జయకు ఇష్టం లేదు
అసలు శశికళ ముఖ్యమంత్రి కావడం జయలలితకు ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఆమెకు పార్టీ అధినేత్రిగా, అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నైతిక అర్హత లేదని చెప్పారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయెస్ గార్డెన్లో గొడవ జరిగిందని చెప్పడం ఇప్పుడు సంచలనానికి దారి తీసింది.
అందరిపైనా దర్యాఫ్తు చేయండి
జయలలిత మృతి పైన, పోయెస్ గార్డెన్లో జరిగిన గొడవ అంశం పైన పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పాండియన్ డిమాండ్ చేశారు. అలాగే, జయ మృతి సమయంలో అపోలో ఆసుపత్రిలో ఆమె వద్ద ఉన్న ప్రతి ఒక్కరి పైన, కుట్ర పైన దర్యాఫ్తు చేయాలన్నారు. జయ మృతి తర్వాత శశికళ తీరు అనుమానాస్పదంగా ఉందని, పదవి చేపట్టాలనుకోవడం ఏమిటన్నారు. జయ, ఎంజీఆర్ ఆమె వద్దని కోరుకున్నారన్నారు.