రూ.40 వేలు, 15 ఫోన్లు మాయం .. ప్రియాంక ర్యాలీలో దొంగల చేతివాటం
లక్నో : ప్రియాంక వాద్రా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈస్ట్ యూపీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తీసిన ర్యాలీలో ప్రజాస్పందన చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. కేంద్రంలో అధికారం దూరమైన కాంగ్రెస్ .. చాలా రాష్ట్రాల్లో కూడా అధికారానికి దూరమైంది. ఈ క్రమంలోనే రాహుల్ కు పట్టాభిషేకం .. ప్రియాంక ఆగమన చకచకా జరిగిపోయాయి.

ర్యాలీలో దొంగల చేతివాటం..
రాజకీయాల సంగతి కాస్త పక్కనపెడితే .. ప్రియాంక ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీ జనసముహంతో నిర్వహించాయి. సందట్లో సడేమియా అన్నట్టు ర్యాలీలో దొంగలు ప్రవేశించి అందినకాడికి దోచుకున్నారు. తీరా ర్యాలీ అయిపోయాక చూసుకుంటే పర్సులు లేవు .. నగదు మాయమైంది. అంతేకాదు 15 స్మార్ట్ ఫోన్లను కూడా వదల్లేదు దొంగలు. ప్రియాంక రాజకీయ ఆరంగ్రేటం కోసం కార్యకర్తలు, శ్రేణులు మునిగితేలితే .. మెల్లిగా తమ పనికానిచ్చేశారు దొంగలు.

నగదు, ఫోన్లు మాయం..
గాంధీ నెహ్రూ కుటుంబాల వారసురాలు, సోనియాగాంధీ కుమార్తె అయిన ప్రియాంక ర్యాలీని కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో లక్నోలో 10 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ తీశాయి. ఈ ర్యాలీలోకి దొంగలు ప్రవేశించారు. కార్యకర్తల ముసుగులో రూ.40 వేల నగదు, 15 ఫోన్లు, రెండు పార్సులను కాజేశారు. సరోజినినగర్ మెట్రో స్టేషన్, బుర్లింగ్టన్ క్రాసింగ్ మీదుగా కొనసాగిన ర్యాలీలో జిల్లా ఉపాధ్యక్షుడు పుష్పేంద్ర పాండే 15 మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని నినాదాలు చేశారు. ర్యాలీ ముగిశాక వారి జేబులు చూసుకుంటే అందులో ఫోన్లు, నగదు లేకపోవడం చూసి అవాక్కవడం వారి వంతైంది.

పీఎస్ ఎదుట ఆందోళన
ప్రియాంక ర్యాలీలో తమ విలువైన వస్తువులు పోయాయని సరోజినినగర్ పోలీసులను ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే అక్కడ వారికి పోలీసుల నుంచి చుక్కెదురైంది. వారి ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో పీఎస్ ఎదుటే ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. యూపీలో అధికార బీజేపీ ప్రభుత్వం ప్రోద్భలంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తర్వాత సరోజినినగర్ పోలీసులు స్పందించారు. ర్యాలీలో జరిగిన చోరికి సంబంధించి ఫిర్యాదు తీసుకున్నామని .. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఇబ్బందికర పరిణామం
యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిస్తే కేంద్రంలో పాగా వేయొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తాయి. ముఖ్యంగా ఈస్ట్ యూపీలో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడి సీట్లు ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం తమ పార్టీ తురుపుముక్క ప్రియాంకగాంధీని రంగంలోకి దింపింది. ప్రియాంక రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. కానీ ఆమె రాజకీయ ఆరంగ్రేటం కోసం చేపట్టిన ర్యాలీలో చేతివాటమే ఆ పార్టీని కాస్త ఇబ్బందికి గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications