జయలలిత ఆరోగ్యంపై ఆందోళన: హైకోర్టులో పిల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే స్పంధించి ప్రకటన చెయ్యాలని మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సోమవారం మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత ఆరోగ్యం విషయంపై అపోలో ఆసుపత్రి తక్షణమే స్పందించి నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని మద్రాసు హై కోర్టును ఆశ్రయించిన ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడుకు చెందిన సుప్రీం కోర్టు న్యాయవాది రీగన్ ఎస్.బెల్ జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు తెలియడం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఎవ్వరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించాలని ఆయన లేఖలో మనవి చేశారు.
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై గత నాలుగు రోజులుగా గంటగంటకు ఎదో ఒకవిధంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డులు, ఫ్లక్సీలు వెలిసే సాధనాలను తొలగిస్తూ తమిళనాడు వ్యాప్తంగా మంచిగుర్తింపు తెచ్చుకున్న ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.