పంబ నదిలో వరద ఉధృతం - శబరిమల దర్శనాలకు ఈ రోజు బ్రేక్ : ప్రభుత్వం ప్రకటన..!!
కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కేరళలోని అన్ని జలాశయాలు నిండిపోయాయి. పంబ నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పంబ నదిలో వరద ఉధృతి దృష్ట్యా.. పంబ, శబరిమలకు యాత్రికులను అధికారులు అనుమతించడం లేదు. పంబ, శబరిమలలో శనివారం దర్శనాలు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. యాత్రికులంతా సహకరించాలని కేరళ ప్రభుత్వం కోరింది. భద్రత దృష్ట్యా మాత్రమే యాత్రికులను అనుమతించట్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు..కోవిడ్ -19 వేళ..జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల పాటు జరిగే వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ కోసం నవంబర్ 16న ఆలయం తెరిచారు. అయితే, తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో పంబ డ్యామ్ కు రెడ్ అలర్ట్ స్టేటస్ జారీ చేసారు. ఆదివారం ఆలయం తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. కక్కి-అనాతోడ్ రిజర్వాయర్కు కూడా రెడ్ అలర్ట్ స్టేటస్ జారీ చేసినట్లు పతనంతిట్ట అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
యాత్రికుల భద్రతను పరిగణలోకి తీసుకొని శనివారం పంబా మరియు శబరిమల యాత్రను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్ను బుక్ చేసుకున్న యాత్రికులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్లో "దర్శనం" కోసం అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
Recommended Video
కార్తీక మాసం ప్రారంభంతోనే పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించారు. మకర సంక్రాంతి నాడు మకర దర్శనం వరకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు శబరిమల చేరుకుంటారు. అయితే, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలే ఆదేశాలు జారీ అయ్యాయి.