మమతా బెనర్జీ కీలక నిర్ణయం: అవి కరోనా రైళ్లంటూ కేంద్రంపై విమర్శలు
కోల్కతా: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలు తెరుస్తున్నట్లు ప్రకటించారు. అయితే, పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను ప్రార్థనా మందిరాలకు అనుమతిస్తామని తెలిపారు.

ప్రార్థనాలయాలకు అనుమతి కానీ..
శుక్రవారం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. మే 31తో లాక్డౌన్ ముగుస్తుండటంతో జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు తెరుస్తామని అన్నారు. అయితే, కేవలం పది మందికి మాత్రమే ఒకసారి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. మతపరమైన ప్రదేశాల్లో గుంపులుగా ఉండేందుకు అనుమతి లేదన్నారు. అంతేగాక, టీ, జ్యూట్ పరిశ్రమలను కూడా 100 శాతం శ్రామికులతో జూన్ 1 నుంచి తెరుస్తామన్నారు.

కరోనాను సమర్థవంతంగా..
అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో తెరుచుకోవచ్చని మమత తెలిపారు. గత రెండు నెలలుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొందని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివల్లేనని చెప్పారు.
Recommended Video

కరోనా రైళ్లు నడుపుతున్నారు..
వలస కార్మికుల కోసం నడుపున్న రైళ్లపై మమత విమర్శలు చేశారు. ఒకే రైల్లో వందల మంది శ్రామికులను తరలిస్తున్నారని, అందుకు బదులు మరికొన్ని రైళ్లు నడపవచ్చు కదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. శ్రామిక ప్రత్యేక రైళ్లు పేరిట రైల్వే శాఖ కరోనా రైళ్లను నడుపుతోందని ధ్వజమెత్తారు. కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4536 కరోనా కేసులు నమోదు కాగా, 295 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2573 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1668 మంది కరోనా నుంచి కోలుకున్నారు.












Click it and Unblock the Notifications