బీహర్ వల్లే: 'జీఎస్టీ బిల్లుపై సోనియాతో మోడీ చర్చ'
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి పాలవ్వడంతోనే ప్రధాని మోడీ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) బిల్లుపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చల ప్రక్రియను ప్రారంభించారని ఆ పార్టీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
శనివారం ఆయన భోపాల్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రధాని మోడీని ఆకాశం నుంచి భూమిమీదకి దించిన ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో అభినందనీయులని ప్రశంసించారు.
‘బీహార్లో బీజేపీకి ఓటమి ఎదురవడం వల్లనే మోడీ జీఎస్టి బిల్లుపై సోనియా, మన్మోహన్తో చర్చలకు శ్రీకారం చుట్టారు. లేకపోతే దేశాన్ని మెజార్టీతో కాకుండా ఏకాభిప్రాయంతో ముందుకు నడపాలని ఆయన చెప్పేవారు కాదు. ఇదంతా బిహార్ ప్రజలతో పాటు ఆ రాష్ట్ర సీఎం నితీశ్, ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీల వల్లనే సాధ్యమైంది' అని దిగ్విజయ్ అన్నారు.
ప్రతిపక్షంతో సమావేశమయ్యేందుకు ప్రధాని మోడీ 18 నెలల సుదీర్ఘ కాలం పాటు ఎందుకు వేచి ఉన్నారని రాహుల్ గాంధీ జట్టులోని కీలక సభ్యుడైన కౌశల్ కె. విద్యార్థి ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్లనే ప్రధాని మోడీ విపక్ష నేతలతో చర్చలు ప్రారంభించారన్నారు.