మోడీతో అమిత్ షా భేటీ: కరోనా, లాక్డౌన్పై కీలక చర్చ, పొడిగింపుపై రేపే ప్రకటన?
న్యూఢిల్లీ: మే 31తో కరోనా లాక్డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా.. శుక్రవారం ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Recommended Video

రేపే ప్రకటన..
దేశంలో కరోనా కేసుల పెరుగుదల, లాక్డౌన్ వంటి కీలక అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాలు చర్చించినట్లు తెలుస్తోంది. మే 31తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు ముగుస్తుండటంతో దీనిపై ప్రధాని మోడీ శనివారం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 1 నుంచి ఎలా?
కాగా, ఆర్థిక కార్యకలాపాలు అనుమతిస్తూ లాక్ డౌన్ ను కొనసాగిస్తే మంచిదని పలువురు ముఖ్యమంత్రులు అమిత్ షాతో చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎంలు తమ అభిప్రాయాలు తెలిపారు. జూన్ 1 నుంచి ఏరకంగా వ్యవహరించాలనే దానిపై గత కొన్ని రోజులుగా ప్రధాని కార్యాలయం లాక్డౌన్ తీరును సమీక్షిస్తోంది.

రాష్ట్రాలు పొడిగింపు కోరుకుంటున్నా..
ఇది ఇలావుండగా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. లాక్డౌన్ను మరికొన్ని వారాలపాటు పొడిగిస్తే మంచిదని అన్నారు. అంతేగాకుండా కేంద్రం మరో 15 రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే, తమ రాష్ట్రానికి కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు రెస్టారెంట్లను అనుమతించాలని కోరానన్నారు.

సడలింపులు మాత్రం..
కాగా, కర్ణాటకలో ఇప్పటికే ప్రార్థనా మందిరాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే, భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే, మరోసారి కేంద్రం లాక్ డౌన్ పొడగిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సడలింపులను మాత్రం రాష్ట్రాలకే వదిలేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు దేశంలో 1,67,442 కరోనా కేసులు నమోదయ్యాయి. 4797 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications