కరోనా: మోదీకి మామూలు షాకివ్వలేదుగా.. ‘5పాయింట్ల’తో సోనియా దాడి.. లాక్డౌన్పైనా కాంగ్రెస్ భిన్నవాదన
మామూలుగా అయితే ఆయన ఎవరిమాట వినరు. ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మితే ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరు. పెద్ద నోట్ల రద్దు కావొచ్చు, పాకిస్తాన్ పై సర్జికల్ దాడి కావొచ్చు.. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేత, ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్... ఇలా చెప్పుకుంటూ పోతే తన ఆరేళ్ల పాలనలో మోదీ ఏనాడూ కాంప్రమైజ్ కాలేదు. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను సైతం ఆయన పట్టించుకోలేదు. కానీ ఇవాళ్టి పరిస్థితి వేరు.

అడిగినందుకు ఇలా..
కరోనా వైరస్ ధాటికి దేశమంతా గజగజలాడుతున్నది. భారీ మెజార్టీ ఉన్నప్పటికీ.. పరిస్థితుల దృష్ట్యా సమిష్టి నిర్ణయాలవైపే మోదీ మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా తాజా, మాజీ పాలకులు, పెద్ద పార్టీల చీఫ్ లకు ఫోన్లు చేసి.. సలహాలు ఇవ్వమని కోరారు. మిగతావాళ్లు తమరకు తోచినరీతిలో చెప్పగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియ గాంధీ మాత్రం ఏకంగా ఐదు పాయింట్లతో కూడిన భారీ ఉత్తరాన్ని రాశారు. దాన్ని కూడా నేరుగా పీఎంకు పంపకుండా, మీడియాకూ విడుదల చేశారు. లేఖలోని ఒక్కో అంశం సూచనలా కంటే మోదీ తీరుపై దాడి అనిపించకమానదు.

పబ్లిసిటీ పూర్తిగా బంద్..
వినూత్న ప్రచారశైలితో దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడి సృష్టించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది. చిన్న పని నుంచి భారీ ప్రాజెక్టుదాకా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిపైనా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం ఎన్డీఏ ప్రభుత్వ విధానంగా వస్తున్నది. అయితే ఇకపై ఆ విధానానికి స్వస్తిపలకాలని, వచ్చే రెండేళ్ల పాటు ప్రభుత్వానికి, ప్రధానికి సంబంధించిన చిన్న యాడ్స్ కు కూడా పైసలు ఖర్చుపెట్టొద్దని, పేపర్లు, టీవీలతోపాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వ యాడ్స్ ను పూర్తిగా బంద్ చేయాలని సోనియా సూచించారు.

ఆ నిర్మాణం ఆపేసి.. నిధుల బదిలీ..
2024లోగా నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్టా భవనాన్ని అందుబాటులోకి తేవాలనుకుంటోన్న మోదీ సర్కారు అందుకోసం రూ. 20 వేల కోట్ల భారీ వ్యయానికి సిద్ధమైంది. కరోనాపై సోనియా రాసిన లేఖలో.. ఈ భవన నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని, పార్లమెంట్ సమావేశాలను ఇప్పుడున్న భవంతిలోనే కొనసాగించాలని, తద్వారా మిగిలే డబ్బును కరోనా నియంత్రణ చర్యలకు ఉపయోగించాలని సూచించారు.

విదేశీ టూర్లు వద్దు..
జీతాలు, పెన్షన్లు, అత్యవసర విభాగాలు తప్ప మిగా శాఖల్లో ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకొవాలని, అలాగే ప్రధానమంత్రి మొదలుకొని మంత్రుల దాకా ప్రభుత్వ ఖర్చులతో విదేశీ యాత్రలు చేయడం మానుకోవాలని సోనియా సూచించారు. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. అలాగే, వివాదాస్పదంగా మారిన పీఎం కేర్ ఫండ్ అకౌంట్ ను మళ్లీ పీఎం రిలీఫ్ ఫండ్కు బదిలీ చేసి, పాత విధానంలోనే విరాళాలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే,

లాక్ డౌన్ ఎత్తేయాలి.. కానీ..
దేశవ్యాప్త లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదన చేసిన తర్వాత ఇతర సీఎంలు కూడా మెల్లగా స్పందిస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఎత్తివేతకు తాను అనుకూలమని, అయితే ఏప్రిల్ 15న ఒకేసారి కాకుండా.. దశలవారీగా ఆ పని చేయాలని సూచించారు. రాజస్థాన్ లో వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టామని చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 325 పాజిటివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications