భూసేకరణ చట్టం: సీఎంలతో మోడీ సమావేశం
న్యూఢిల్లీ: భూస్వాధీన చట్టం అమలు చెయ్యడానికి తీసుకోవలసిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 15వ తేది (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సహ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీలోని నెంబర్ 7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోడీ ఇంటిలో జరిగే ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
భూస్వాధీన చట్టం అమలు చెయ్యడానికి తాము అంగీకరించమని కాంగ్రెస్ తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు.
సమావేశానికి హాజరు కావాలని సీఎంలను ఆహ్వానించారు. భూస్వాధీనం చట్టంతో పాటు పలు విషయాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు కారణాల వలన తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ప్రధాని మోడీకి లేఖ పంపించారని తెలిసింది.