కరోనా తొలి రోజుల తరహా పరిస్థితులు: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్: లాక్డౌన్కు ప్రిపేర్?
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోన్నాయి. ఈ నెల ఆరంభంలో 10 వేలకు దిగువగా నమోదైన రోజువారీ కేసులు.. రెండు వారాలు తిరిగే సరికి 25 వేలకు చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా 20 వేలకు పైగా కేసులు రికార్డవుతున్నాయి. ప్రత్యేకించి- మహారాష్ట్ర కరోనా వైరస్ బారిన పడింది. వేలల్లో అక్కడ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ముంబై, పుణే, నాసిక్, నాగ్పూర్ వంటి పలు నగరాల్లో రోజువారీ కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. పెరుగుతున్న కొత్త కేసులతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాఠశాలలకు రొటేషనల్ అటెండెన్స్ ప్రకటించింది.
కరోనా వైరస్ థర్డ్ వేవ్: రోజూ పాతిక వేలకు పైగా కొత్త కేసులు: ఆ దేశం అతలాకుతలం
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ సమావేశం ఆరంభమౌతుంది. కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటారు. వాటిని ఎలా కట్టడి చేయాలనే విషయంపై ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేస్తారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొంటారు.
కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తొలి రోజులను గుర్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయి. మూడు నెలలకు పైగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన లాక్డౌన్ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తరచూ వీడియో కాన్ఫరెన్స్లను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం నెలకొంది. పెరుగుదల బాట పట్టిన కరోనా కేసులను నియంత్రించడానికి ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠత రేపుతోంది.
రోజువారీ కొత్త కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదవుతుండటంతో.. కఠిన ఆంక్షలను విధించాలంటూ సూచనలు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. సరిహద్దులను మూసి వేయడం, కొత్తగా వచ్చే వారిని క్వారంటైన్కు తరలిొంచడం, కరోనా కేసుల నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించడం వంటి చర్యలు మళ్లీ తీసుకోవాలంటూ ప్రధాని ముఖ్యమంత్రులకు సూచించే అవకాశాలు లేకపోలేదు. ఒకవంక వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కొత్త కేసులు వేలకొద్దీ పుట్టుకొస్తున్నాయని కేంద్రం భావిస్తోంది.