ఉక్రెయిన్ పరిణామాలపై మోడీ మరోసారి అత్యున్నత భేటీ: నిర్మలమ్మ పాల్గొనడంపై
న్యూఢిల్లీ: రష్యా.. తన పొరుగు దేశం ఉక్రెయిన్పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోంది. 18 రోజులుగా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఉక్రెయిన్లోని దాదాపు అన్ని రీజియన్లపైనా రష్యా బాంబుల మోత మోగిస్తోంది. ఇప్పటికే పలు నగరాలు రష్యా సైనిక బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. తూర్పు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టే కనిపిస్తోంది. రాజధాని కీవ్ను సొంతం చేసుకోవడానికి రష్యా చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైన్యం- సమర్థవంతంగా అడ్డుకుంటోంది. మిగిలిన రీజియన్లు, నగరాల్లో ఈ తరహా పరిస్థితులు కనిపించట్లేదు.
ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాను నిలువరించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు అన్ని రకాలుగా ఆంక్షలను విధించాయి. ఆ దేశంతో అన్ని సంబంధాలను తెంచుకున్నాయి. రష్యాను ధీటుగా ఎదిరించడానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటోన్నాయి. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. తమ ఆయుధ సంపత్తిని అందజేస్తోన్నాయి. ఫలితంగా- ఉక్రెయిన్ ఊహించినంత తేలిగ్గా రష్యాకు లొంగట్లేదనేది స్పష్టమౌతోంది.
ఈ నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మూడోవారంలో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన పరిణామాలపై ఆరా తీశారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన ష్రింగ్లా ఇందులో పాల్గొన్నారు.
Prime Minister @narendramodi is charing a high-level meeting to review India’s security preparedness, and the prevailing global scenario in the context of the ongoing conflict in #Ukraine.#RussiaUkraineWar #RussiaUkraineConflict pic.twitter.com/8MbL7bMYkI
— Oneindia News (@Oneindia) March 13, 2022
ఈ ఉన్నతస్థాయి సమాశంలో నిర్మల సీతారామన్ పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై మోడీ ఇదివరకు కూడా ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించినప్పటికీ- నిర్మల సీతారామన్ గానీ, ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శాఖ అధికారులు గానీ పాల్గొనలేదు. ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా నిర్మలమ్మ హాజరు కావడం చర్చనీయాంశమౌతోంది. ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీయడానికే ఆమెను ఈ సమీక్షా సమావేశంలో భాగస్వామిని చేసినట్లు చెబుతున్నారు.
యుద్ధం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో పడింది?, రోజువారీ రాబడి, పెట్రోల్- డీజిల్ ధరలను పెంచాల్సిన అంశం గురించి మోడీ ఆమెను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. యుద్దం మరింత కాలం పాటు కొనసాగాల్సి వస్తే- అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని- మంత్రులతో చర్చించారని అంటున్నారు. దేశీయ భద్రత వ్యవహారాలు, రష్యా నుంచి రక్షణ మంత్రిత్వ శాఖకు అందాల్సిన ఆయుధాలు, దీనికి సంబంధించిన ఒప్పందాల గురించి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ను అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.