ఉద్యోగాల కల్పనపై కోవిడ్ ఎఫెక్ట్-ప్రధాని మోడీ- 75వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్లు
భారత్ లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఉపాధి కల్పన తక్కువగా ఉండటానికి గల కారణాలను ఢిల్లీలో నిర్వహించిన రోజ్ గార్ మేళా (జాబ్ మేళా)లో ప్రధాని మోడీ వెల్లడించారు. అయినా కేంద్రం తన ప్రయత్నాలను తాను చేస్తోందన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన జాబ్ మేళాలో 75 వేల మంది అభ్యర్ధులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని మోడీ పేర్కొన్నారు. కోవిడ్ ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్రంగా పడిందని, అయినా కేంద్రం యువతనకు ఏదో విధంగా ఉపాధి కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని మోడీ తెలిపారు. అంతర్జాతీయంగా పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని, పెద్ద పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మోడీ తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత అన్ని దేశాల్ని వెంటాడుతున్నాయన్నారు.
కరోనా కారణంగా భారత్ ఎదుర్కొన్న పరిస్ధితులు కేవలం 100 రోజుల్లోనే పూర్తిగా సమసిపోవని మోడీ తెలిపారు. అంతర్జాతీయంగా పడుతున్న ప్రభావాల్ని తట్టుకుంటూ భారత్ తన ప్రజల్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని మోడీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రభావం భారత్ మీద సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారమని, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకూ ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన 75 వేల మందికి ఎలక్ట్రానికి విధానంలో 75 వేల అపాయింట్ మెంట్ లెటర్లు మోడీ జారీ చేసారు.