కరోనా లాక్డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్లోగా అది జరగాలంటూ..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే ప్రభుత్వమే అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందన్న ఆరోపణలున్నాయి. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో చాలా దేశాలు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నాయని సాక్ష్యాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. వీటికి భిన్నంగా భారత్ లో మాత్రం లాక్ డౌన్ సూపర్ సక్సెస్ అయింది.. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్ధారించారు.
మనని చదువుతారు..
ఈనెల చివరి ఆదివారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కీలక సందేశాన్ని వినిపించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్ లో జరుగుతున్న విషయాలు చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్న గొప్ప సందర్భం ఇక్కడ ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ''ప్రజలే ముందుండి నడిపిస్తున్న ఈ యుద్ధంలో.. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్లను అనుసరిస్తున్నారంతే..''అని తెలిపారు.
ప్రతి ఒక్కరు సిపాయిలా..
''దేశం నుంచి పేదరికాన్ని తరిమేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్ సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చిపడింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మనకు.. లాక్ డౌన్ విదించడం తప్ప మనకు వేరే మార్గం లేనేలేదు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సిపాయిలా మారి పోరాడుతున్నారు. ఈ 'పీపుల్ డ్రివెన్ వార్'పై ప్రపంచమంతటా చర్చ జరిగితీరుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ ప్రజలు ఒక్కటయ్యారు. పేదలకు అన్నం పెట్టడం దగ్గర్నుంచి రేషన్ సరుకుల పంపకం దాకా అన్ని చోట్లా లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. యావత్ దేశం ఒకే దశలో, ఒకే లక్ష్యతో ముందుకు వెళుతున్న సందర్భమిది. చప్పట్లు, దీపకాంతులు మనకు స్ఫూర్తి, ప్రేరణ ఇస్తున్నాయి.
కరోనాపై ఇదే మన ఆయుధం..
కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అన్నదాతలు పంటపొలాల్లో పనిచేస్తున్నారు.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే గొప్ప మనసు మారిది. ఇంకొందరేమో కిరాయిలు మాఫీ చేస్తున్నారు, మరికొందరు తమ పెన్షన్ డబ్బుల్ని పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తున్నారు. కూరగాయల్ని పంచేవాళ్లు కోకొల్లలైతే.. మాస్కుల తయారు చేస్తున్నవాళ్లూ కోకొల్లలు ఉన్నారు.. ఓ స్కూల్ బిల్డింగ్ లో క్వారంటైన్ లో ఉన్న వలస కూలీలు.. ఆ బడికి రంగులు వేసి అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనందరం చూశాం. ఎలాగైనాసరే పొరుగువాళ్లకు సాయపడాలన్న మంచి తలంపు ఉందే.. కరోనాపై యుద్ధంలో ఇదే మన ఆయుధం.
రంజాన్ లోగా వైరస్ తగ్గాలని..
గతేడాది రంజాన్ కంటే ఈసారి ప్రార్థనలు బాగా చేయాలని కోరుతున్నాను. పండుగరోజు నాటికి కరోనా వైరస్ అంతమైపోవాలని ఆశిస్తున్నాను. సామూహిక ప్రార్థనల విషయంలో మాత్రం స్థానిక అధికారులు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. బహిరంగంగా ఉమ్మి వేయడం అనే చెడ్డ అలవాటు ఈ దెబ్బతో మానేయాలి. ఇప్పటికే దీనిపై ఆదేశాలు వెలువడ్డాయి. మాస్కులు ధరించడాన్ని సివిలైజేషన్ కు గుర్తుగా చూడాలేతప్ప రోగాల బారిన పడినవాళ్లే మాస్కులు వాడుతారనే తప్పుడు ఆలోచనను మనసులో నుంచి చెరిపేయాలి.
వైద్య సిబ్బంది ఖుష్..
కొవిడ్-19పై పోరులో ఫ్రంట్ లైన్లో ఉన్న వైద్య సిబ్బంది.. వారి రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్కులు, పీపీఈల సరఫరాతోపాటు వైద్య సిబ్బందిపై దాడుల నివారణకు ఇటీవల తీసుకొచ్చిన కఠిన చట్టంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, రాష్ట్రాలు కూడా తమ వంతు పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లోని అన్ని శాఖలు ఒక్కటిగా పనిచేస్తోన్న గొప్ప సందర్భమిది. అందుబాటులో ఉన్న డిజిటిల్ టెక్నాలజీని వాడుకుంటూ covidwarriors.gov.in, ఆరోగ్య సేతు లాంటి ప్లాట్ ఫామ్స్ ఏర్పాటుచేయడం ద్వారా 1.25 కోట్ల మంది డాక్టర్లు, నర్సులు, ఎన్సీసీ క్యాడెట్లను ఒకేతాటిపైకి తీసురావడం, ప్రజల్లో వైరస్ పట్ల మరింత అవగాహన కల్పిస్తుండడం గొప్పవిషయాలు'' అని ప్రధాని మోదీ వివరించారు.