పాక్ ఆర్మీ చీఫ్ తో లంచ్ మీటింగ్ వేళ.. ట్రంప్ కు మోదీ ఫోన్ కాల్- తెగేసి చెప్పిన ప్రధాని
Donald Trump- Asmi Munir Lunch meeting: పహల్గామ్ లో భయానక ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి భోజనం చేయనున్నారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వైట్ హౌస్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ రోజువారీ కార్యక్రమాలతో కూడిన అధికారిక ప్రకటనను వెలువడించింది. డొనాల్డ్ ట్రంప్ పాల్గనబోయే మూడు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది వైట్ హౌస్.

ఉదయం 9 గంటలకు ఇన్- టౌన్ పూల్ కాల్ టైమ్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ఫ్రెంచ్ రాయబారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు ట్రంప్. అనంతరం మొనాకో ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తరువాత అసీమ్ మునీర్ తో సమావేశమౌతారు.
అనంతరం ఒంటిగంటకు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ తో కలిసి డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్నం భోజనం చేస్తారని వైట్ హౌస్.. రోజువారీ షెడ్యూల్ లో పొందుపరిచింది. నిజానికి ఇది క్లోజ్డ్ - డోర్ మీటింగ్. మీడియాకు కూడా ఇందులో ప్రవేశం లేదు. భోజనానంతరం పలు అంశాలపై చర్చిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ రూమ్లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ ప్రైవేట్ లంచ్ కు మీడియాకు ప్రవేశం లేదు. దీని తరువాత అసీమ్ మునీర్.. తన పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ లతో కూడా సమావేశం కానున్నారు.
ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. సుమారు 35 నిమిషాల పాటు వారి మధ్య ఈ ఫోన్ సంభాషణ కొనసాగింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో భయానక ఉగ్రవాదుల దాడి అనంతరం.. ఆయనతో మోదీ ఫోన్ లో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాక్ పై ప్రతీకార దాడుల కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశం ఈ సందర్భంగా వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది. దీన్ని చేపట్టడానికి గల కారణాలను మోదీ వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అలాగే- పాక్ తో యుద్ధాన్ని కొనసాగించడం లేదా నిలిపివేసే విషయంలో ఏ స్థాయిలో కూడా తాము ఎవరి సహాయాన్ని గానీ, మధ్యవర్తిత్వాన్ని గానీ కోరలేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తాము ఎప్పుడూ అడగలేదని మోదీ వివరించినట్లు మిస్రీ పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరపలేదని అన్నారు.
పాకిస్తాన్ అభ్యర్థన మేరకే సైనిక చర్యను నిలిపివేశామని డొనాల్డ్ ట్రంప్ కు మోదీ వివరించినట్లు మిస్రీ తెలిపారు. ఇరు దేశాల ఆర్మీ చీఫ్ స్థాయి హాట్ లైన్ సంభాషణలో సైనిక చర్య నిలిపివేత అంశం ప్రస్తావనకు వచ్చిందని, పాక్ అభ్యర్థన మేరకే దాడులను నిలిపివేమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications