మనమెంతో బెటర్: భవిష్యత్ బాగుంటుందని ప్రధాని మోడీ, సీఎంల భేటీలో కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం జూన్ 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. జూన్ 30న ఐదవ లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఈ ఆన్ లైన్కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఉద్రిక్తల నేపథ్యంలోనే సీఎంల భేటీ..
లడఖ్ సరిహద్దులో చైనా-భారత దళాల ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లతోపాటు ఐదుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు చర్చలంటూనే చైనా బరితెగించింది. ఈ క్రమంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ముందే ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్ణయించబడిన నేపథ్యంలో ప్రధాని ఈ సమావేశానికి హాజరయ్యారు.

మనమే బెటర్..
ఈ సమావేశంలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటి లాక్డౌన్ సడలింపులు భవిష్యత్లో మంచి ఫలితానిస్తాయన్నారు ప్రధాని మోడీ. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని ప్రధాని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అతి తక్కువ మరణాలు చోటు చేసుకున్న దేశాలలో భారత్ కూడా ఒకటని ప్రధాని వ్యాఖ్యానించారు.
కో-ఆపరేటివ్ ఫెడరలిజమ్.. మనమే ఆదర్శం..
మాస్కులు లేకుండా బయట తిరగడం మంచిది కాదని ప్రధాని మోడీ సూచించారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ను ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాడుతున్న తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. గత కొన్ని వారాలుగా తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థకు మెరుగుదలకు తోడ్పడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రులు చేస్తున్న సూచనలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. ఈ సంక్షోభ సమయంలో చూపిన కో-ఆపరేటివ్ ఫెడరలిజమ్ ఎంతో స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు.

మూడున్నర లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు దేశంలో 3,44,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,54,037 యాక్టివ్ కేసులున్నాయి. 1,80,589 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 9,925 మంది మరణించారు.












Click it and Unblock the Notifications