ప్రధాని మోడీ కానుకగా ఇచ్చిన 'లోటస్ లీఫ్ టీ' ప్రత్యేకత ఏంటో తెలుసా..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటనలో.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులు ప్రపంచ నాయకులకు అందించారు. ఈ కానుకల్లో మణిపూర్ రాష్ట్రానికి చెందిన అరుదైన "లోక్తక్ లోటస్ టీ" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక టీపొడిని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్కు బహుమతిగా ఇవ్వడం విశేషం.
లోక్తక్ లోటస్ టీ సాధారణ టీ కాదు. ఈ టీ మణిపూర్లోని ప్రసిద్ధ లోక్తక్ సరస్సు పరిసర ప్రాంతాల్లో సహజంగా పెరిగే తామర ఆకుల నుంచి తయారవుతుంది. ఈ సరస్సు ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ప్రకృతి అందాలు, జీవవైవిధ్యం, తేలియాడే దీవులు (ఫుమ్డిస్) కారణంగా ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే ప్రాంతం నుంచి సేకరించే తామర ఆకులు ఈ టీకి ప్రత్యేక సువాసన, ఔషధ గుణాలను అందిస్తాయి.

మహిళల ఆలోచనతో పుట్టిన ప్రత్యేక ఉత్పత్తి..
మణిపూర్లోని థంగా గ్రామానికి చెందిన మహిళల స్వయం సహాయక బృందాల ఆలోచనతో ఈ లోటస్ టీ తయారీ ప్రారంభమైంది. స్థానిక వనరులను వినియోగించి ఆదాయం పెంచుకోవడమే కాకుండా, ప్రాంతీయ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం మొదలైంది. సరస్సు పర్యావరణ సమతౌల్యానికి భంగం కలగకుండా, పూర్తిగా సహజ పద్ధతుల్లో తామర ఆకులను సేకరించడం ఈ టీ ప్రత్యేకత. ఎలాంటి రసాయనాలు లేకుండా తయారుచేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఈ టీకి మంచి డిమాండ్ పెరుగుతోంది.
ప్రపంచ నేతలకు సాధారణంగా విలాసవంతమైన, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ప్రధాని మోదీ మణిపూర్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ స్థానిక ఉత్పత్తిని ఎంపిక చేయడం ద్వారా "వోకల్ ఫర్ లోకల్" భావనను మరోసారి ప్రపంచానికి చాటారు. ఈశాన్య భారతదేశానికి చెందిన కళలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది ప్రతీకగా నిలిచింది.
స్వీడన్ ప్రధానికి ప్రత్యేక కానుకలు..
లోక్తక్ లోటస్ టీతో పాటు, స్వీడన్ ప్రధానికి మోదీ మరికొన్ని భారతీయ వారసత్వ కానుకలను అందించారు.
అందించిన బహుమతులు :
- చేతితో తయారుచేసిన శాంతినికేతన్ లెదర్ బ్యాగ్
- రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల సంపుటి
- మణిపూర్ ప్రత్యేక లోక్తక్ లోటస్ టీ
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకు మణిపూర్లో ప్రసిద్ధి చెందిన షిరుయ్ లిల్లీ పట్టు దుపట్టాను ప్రధాని మోదీ అందించారు. ఇది ఈశాన్య భారత హస్తకళల వైభవాన్ని ప్రతిబింబించింది.
అలాగే ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాకు భారతీయ సంగీత దిగ్గజాలు పండిట్ భీమ్సేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గీతాల సీడీలను ప్రత్యేక మార్బుల్ బాక్స్లో అందజేశారు.
ఇంకా మణిపూర్కు చెందిన ప్రసిద్ధ బ్లాక్ రైస్ను కూడా కానుకగా ఇవ్వడం విశేషం.
'సాఫ్ట్ డిప్లమసీ'లో భారత ప్రత్యేకత..
ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో భారతదేశం ఇప్పుడు "సాంస్కృతిక దౌత్యం"పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. భారతీయ హస్తకళలు, ప్రాంతీయ ఉత్పత్తులు, సాంప్రదాయ వస్తువులను బహుమతులుగా అందించడం ద్వారా దేశ వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తోంది. ప్రధాని మోదీ ఎంపిక చేసిన ఈ కానుకలు కేవలం బహుమతులుగానే కాకుండా, భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, స్థానిక కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications