కొత్త పార్లమెంట్లో మోదీ కీలక స్పీచ్: ఎవరెక్కడ కూర్చుంటారో- విపక్షానికి సవాల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన సముదాయం మనుగడలోకి వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. లోక్సభ, రాజ్యసభ సభ్యులు కొద్దిసేపటి కిందటే కొత్త పార్లమెంట్ భవనంలో లాంఛనంగా అడుగుపెట్టారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి.. ఇలా కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులందరూ ఒక జట్టుగా కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. మహిళా సభ్యులందరూ మరో జట్టుగా బయలుదేరి వెళ్లడం కనిపించింది.

ఇక కాంగ్రెస్ సభ్యులందరూ మరో జట్టు కట్టారు. రాహుల్ గాంధీతో కలిసి వారంతా కొత్త పార్లమెంట్ వైపు సాగిపోయారు. లోనికి అడుగుపెట్టడానికి ముందు వారంతా కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమయంలో అధిర్ రంజన్ చౌదరి.. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశించిన వెంటనే జాతీయ గీతాలాపనతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా తన స్థానంలో ఆసీనులయ్యారు. ఆ వెంటనే ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలకాంశాలను ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందనీ పేర్కొన్నారు.

వచ్చే సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించీ మోదీ మాట్లాడారు. లోక్సభ వేదికగా ఎన్నికల గురించి ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ మరల్చుకుంది. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనంటూ వ్యాఖ్యానించారు మోదీ.
ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పటివరకు అధికార, ప్రతిపక్ష సభ్యుల వ్యవహార శైలి గెలుపోటములను శాసిస్తుందని చెప్పారు. అధికార పక్షం వైపు ఎవరు కూర్చుంటారు?, ప్రతిపక్ష స్థానాల్లో ఎవరు కూర్చుంటారు? అనేది వారి వారి వ్యవహార శైలి నిర్ధారిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications