ప్రధాని మోదీ గల్లంతు -పన్నులు, ఫొటోలే మిగిలాయి -అమిత్ షాపై మిస్సింగ్ కేసు నమోదు -కాంగ్రెస్ ఫైర్
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతూ, రోజూ వేలల్లో మరణాలు, లక్షల్లో ఇన్ఫెక్షన్లకుతోడు ఆక్సిజన్ లేక చావులు, నదుల్లో కొట్టుకొస్తున్న శవాలు.. పరిస్థితిని మరింత హృదయవిదారకంగా మార్చాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత ఇబ్బందికరంగా మారింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రంలోని మోదీ సర్కారు చేతులెత్తేసినట్లుగా వ్యవహరించడం, ఇవతల జనం ప్రాణాలు పోతున్నా అత్యంత ఖరీదైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును యథావిథిగా కొనసాగిస్తుండటం విమర్శలకు తావిచ్చినట్లయింది. ప్రభుత్వ అధినేతలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తున్నారు..
వ్యాక్సిన్లపై ఎన్టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్
మోదీ గల్లంతు.. ఆయన ఫొటోలే
''కొవిడ్ విలయతాండవం చేస్తోన్న వేళ ఆక్సిజన్, అత్యవసర మందులు, వ్యాక్సిన్లతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం ఎటుచూసినా ప్రధాని మోదీ ఫొటోలు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు, మందులపై జీఎస్టీ పన్నులు తప్ప మిగతావేవీ కనిపించడంలేదు'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరోవైపు..
అమిత్ షా మిస్సింగ్.. కేసు..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై బీజేపీని నడిపించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత కరోనా విలయం కాంలో కనిపించకుండా పోయారని, ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి కనిపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్ అసెంబ్లీ పోల్స్ తర్వాత అమిత్ షా కనిపించకుండా పోవడాన్ని ప్రశ్నిస్తూ ట్విటర్ లోనూ 'అమిత్ షా మిస్సింగ్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 'దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా హెచ్ఎం (హోం మినిష్టర్) 'ఎంఐఏ' (మిస్సింగ్ ఇన్ యాక్షన్)' అంటూ పలువురు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా, అమిత్ షా మిస్సింగ్ అంటూ ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్ కరియప్ప ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆయన కార్యాలయాన్ని సందర్శించారు.
9 డిమాండ్లలో 12 విపక్ష పార్టీలు..
దేశంలో కరోనా విలయం నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానినికి లేఖ రాశారు. అందులో 9కీలక డిమాండ్లను పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్ లో కేటాయించిన 35వేల కోట్లు ఖర్చుచేయాని, వీలైనన్ని అన్ని మార్గాల్లో టీకాలను సేకరించాలని, దేశీ తయారీదరులకు లైసెన్సుల మినహాయింపులు కల్పించాలని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును రద్దు చేసి ఆ డబ్బుతో ఆక్సిజన్, వ్యాక్సిన్లు కొనాలి, ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన పీఎం కేర్స్ సహా అన్ని ప్రైవేటు ట్రస్టుల డబ్బులను వెలికితీసి కొవిడ్ కోసం వాడాలి. నిరుద్యోగులకు నెలనెలా రూ.6వేలు భృతి ఇవ్వాలని, పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని, ఆందోళన చేస్తోన్న రైతులు కొవిడ్ బారినపడకుండా మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీని డిమాండ్ చేశాయి.