స్మృతి ఇరానీకి మరో ఎదురుదెబ్బ!: ప్రధాని మోడీ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో వివాదాల కారణంగా తనకు ఎంతో ఇష్టమైన కేంద్రం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి ఆమెకు ప్రాధాన్యం లేని జౌళి శాఖకు మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ శాఖ బాధ్యతలను ప్రకాశ్ జవదేకర్కు అప్పగించారు.
స్మృతిఇరానీ శాఖ మార్పు వెనుక అసలు కారణం ఇది
ఈ నిర్ణయంతో కాస్తంత అసంతృప్తికి లోనైన స్మృతి ఇరానీ... జవదేకర్కు తన మంత్రివర్గ బాధ్యతలను అప్పగించే కార్యక్రమానికి కూడా గైర్హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి తోడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్మన్ పదవి కోసం ఆమె ప్రతిపాదించిన వ్యక్తి పేరును ప్రధాని మోడీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
సీబీఎస్ఈ చైర్మన్ లాంటి కీలక పదవుల భర్తీ ప్రక్రియతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధమేమీ లేదని అపాయింట్ మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ఏసీసీ) తేల్చిచెప్పింది. ఈ కమిటీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతననే పనిచేస్తుండటం విశేషం.
వివరాల్లోకి వెళితే... 2014 డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్న సీబీఎస్ఈ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి హోదాలో గతంలో ఇరానీ... కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల కమిటీ (డీఓపీటీ)కి లేఖ రాసింది. ఈ పదవికి ముగ్గురు విద్యావేత్తల పేర్లను ప్రతిపాదిస్తూ స్మృతి ఇరానీ ఆ లేఖలో పేర్కొన్నారు.
స్మృతి ఇరానీపై వేముల రోహిత్ ఆత్మహత్య దెబ్బ!: మోడీ ప్లాన్
స్మృతి ఇరానీ ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తుల్లో ఉత్తరప్రదేశ్ ఎస్ఈఆర్టీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సర్వేంద్ర బహదూర్ విక్రమ్ బహదూర్ సింగ్తో పాటు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కమలకాంత బిశ్వాల్, భారత నావికాదళ విద్యా విభాగానికి అదనపు ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఉన్న ఖుర్రం షెహజాద్ నూర్లు ఉన్నారు.
జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన ఈ పదవికి రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల పాటు ఎడ్యుకేషనల్ అడ్మిస్ట్రేషన్లో అనుభవం కలిగి ఉండాలి. సెర్చ్-కమ్- సెలక్షన్ పద్ధతి ఆధారంగా పైన పేర్కొన్న ముగ్గురిని ఈ ఏడాది మార్తి 15న ఇంటర్యూ చేయడం జరిగింది.
ఈ ముగ్గురిలో విక్రమ్ సింగ్కే సీబీఎస్ఈ చైర్మన్ పదవి ఇప్పించేందకు స్మృతి యత్నించినట్లు అప్పట్లో జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ముగ్గురు పేర్లను తిరస్కరిస్తూ అపాయింట్ మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ఏసీసీ) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపించిన లేఖను తిప్పి పంపింది.