టైముంటే చదవాలా? ఇంట్రెస్ట్ లేదు.. గిఫ్టును తిప్పిపంపిన ప్రధాని మోదీ.. ఇప్పుడేం చేద్దాం?
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పంపిన స్పెషల్ గిఫ్టును ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిపంపారు. అమెజాన్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో డెలివరీకి వచ్చిన 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం సోమవారం తిరస్కరించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్ లో తెలిపింది.
అసలేం జరిగిందంటే..
సీఏఏ నిరసనల నేపథ్యంలో ప్రధానికి రాజ్యాంగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ.. ‘రాజ్యాంగం పుస్తకం' కాపీని పీఎంవోకు గిఫ్టుగా పంపింది. దేశాన్ని విభజించే పనిలో ప్రధాని బిజీగా ఉన్నారని, ఏకొంచెం టైమ్ దొరికినా రాజ్యాంగం పుస్తకాన్ని చదవాలని, తద్వారా మన దేశంపై అవగాహన పెరుగుతుందని, అందుకే గిఫ్టు పంపామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అది తిరస్కరణకు గురికావడంతో కాంగ్రెస్ సోమవారం మరో ప్రకటన చేసింది.
అయ్యో.. మళ్లొచ్చింది..
‘‘ప్రియమైన భారత ప్రజలారా.. మన ప్రధాని చేత రాజ్యాంగం చదివించడానికి మేం చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. మేం పంపిన రాజ్యాంగం పుస్తకాన్ని చదివే ఇంట్రెస్ట్ లేదన్నట్లు మోదీ తిప్పి పంపారు. ఇప్పుడిక ఏం చేద్దాం?''అంటూ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. మతం ఆధారంగా పౌరసత్వాన్ని అందించే సీఏఏను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ విషయాన్ని తెలియజెప్పడానికే ప్రధానికి రాజ్యాంగం పుస్తకం పంపామని చెప్పుకొచ్చింది.
వైరల్ గిఫ్ట్..
ప్రధానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం కాపీని గిఫ్టుగా పంపడం.. అదికూడా క్యాష్ ఆన్ డెలివరీ చేయడం.. గంటల వ్యవధిలోనే ప్రధాని కార్యాలయం దాన్ని తిరస్కరించడం.. మోదీగారికి రాజ్యాంగం చదివే ఇంట్రెస్ట్ కూడా లేదని కాంగ్రెస్ మండిపడటం.. ఇలా స్పెషల్ గిఫ్టుకు సంబంధించిన వార్తలన్నీ ఆదివారం నుంచి సోమవారం దాకా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. దీనిపై బీజేపీ నేతలెవరూ నేరుగా స్పందించలేదు.