Omicron Virus : అధికారులతో ప్రధాని మోడీ రివ్యూ- అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలకు రెడీ
దక్షిణాఫ్రికాలో కలకలం రేపుతున్న ఓమిక్రాన్ కరోనా వైరస్ రకంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఒక్కో దేశం దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర చర్యలు కూడా చేపడుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీ కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వాస్తవ పరిస్ధితుల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ఇవాళ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. కొత్త ఓమిక్రాన్ వేరియంట్ గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కొత్త వేరియంట్ రాక నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపును సమీక్షించాల్సి ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న ఓమిక్రాన్ వేరియంట్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక నివేదిల ప్రకారం చూసినా భారతదేశానికి కొత్త వేరియంట్ యొక్క చిక్కులు, ఇతర దేశాలపై దాని ప్రభావం పొంచి ఉంది. దీంతో ఇవాళ మోడీ అధఇకారులతో దీనిపై చర్చించారు. కొత్త వేరియంట్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్తో సహా పలు దేశాల్లో బయటపడినట్లు అధికారులు ఆయనకు వివరించారు.
అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని మోడీ అధికారులను కోరారు. కరోనావైరస్ కారణంగా 20 నెలల సస్పెన్షన్ తర్వాత షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు డిసెంబర్ 15 నుండి తిరిగి ప్రారంభమవుతాయని నిన్న కేంద్రం ప్రకటించింది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్కింగ్, సామాజిక దూరం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 'రిస్క్లో ఉన్న' దేశాలపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయ రాకపోకలను పర్యవేక్షించడం, పరీక్షించాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ప్రధానితో భేటీలో అధికారులు 'హర్ ఘర్ దస్తక్' పేరుతో ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ తాజా పరిస్ధితిపై ప్రధాని మోదీకి వివరాలు అందించారు. దీనిపై స్పందించిన మోడీ... దేశంలో రెండో డోస్ కవరేజీని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మొదటి డోస్ పొందిన వారందరికీ సకాలంలో రెండవ డోస్ ఇచ్చేలా రాష్ట్రాలు తప్పనిసరిగా చూడాలని ఆయన తెలిపారు.