నరేంద్ర మోడీ రెండేళ్ల పాలన బాగుంది: తేల్చిన సర్వే
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన పాలన పట్ల ఓ సర్వే నిర్వహించారు. మోడీ పాలన పట్ల ఎక్కువ శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలలోను అది తేలింది.
సర్వే విషయానికి వస్తే.. మోడీ ప్రధానిగా ఉండటంతో ఎన్డీయే పాలన సంతృప్తికరంగా ఉందని మూడింట రెండొంతుల మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 15 వేలమందిని సర్వేలో భాగస్వామ్యం చేసింది.
వారికి 20 ప్రశ్నలు సంధించింది. ఈ సర్వే ప్రకారం.. 64 శాతం మంది పౌరులు, తమ అంచనాలకు అనుగుణంగా మోడీ పాలన సాగుతోందని, 36 శాతం మంది అంచనాలకు తగ్గట్టు పాలన లేదన్నారు. కీలక రంగాల్లో మరింతగా చేయాల్సి ఉందన్నారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు, ధరల పెరుగుదలను ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అత్యధికులు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, సబ్సిడీని డైరెక్టుగా ఖాతాలోకి జమ చేయడం వంటి అంశాలతో భారత్లోనే తమ కుటుంబ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని భావిస్తున్నట్టు 76 శాతం మంది వెల్లడించారు.
కేంద్రం జీఎస్టీని ఎలాగైనా అమలు చేసి తీరుతుందని 61 శాతం, ఆ నమ్మకం లేదని 30 శాతం మంది చెప్పారు. మౌలిక వసతుల విషయంలో అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత నెలలో ఈ సర్వే జరిగింది. 15 వేల మంది నుంచి 3,75,568 సమాధానాలను తీసుకుని వాటిని క్రోఢీకరించినట్టు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది.
నిరుద్యోగ సమస్య తగ్గిందని 35 శాతం మంది, నేరాలు తగ్గాయని 38 శాతం మంది, ప్రజల సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోందని 36 శాతం మంది, అవినీతి తగ్గిందని 61 శాతం మంది, ఉగ్రవాదం పెరిగిందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్తో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని 34శాతం, 51 శాతం ఎలాంటి మెరుగుదలా కనిపించలేదన్నారు.












Click it and Unblock the Notifications