ప్రధాని మోడీ పిలుపు: ఏప్రిల్ 5 భారత విద్యుత్ రంగానికి అతిపెద్ద సవాలే! ఏం చేయాలంటే.?
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో భరోసా నింపుతున్న విషయం తెలిసిందే. కరోనాను 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మనదేశం నుంచి పారద్రోలాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే జనతా కర్ఫ్యూ, వైద్యులకు, పోలీసులు, కరోనా సేవలందిస్తున్న వారికి అభినందనలు తెలిపే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కట్టడి కోసం మూడువారాలపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.

5న విద్యుత్ లైట్లు ఆర్పేసి..
ప్రధాని మోడీ తాజాగా మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5 ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా కరోనావైరస్తో అంధకారంలోకి వెళ్లిపోయిన భారత్ ఒంటరి కాలేదని, దీనిపై పోరాడి తిరిగి వెలుగులోకి తీసుకొస్తామనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ చాటాలన్నారు. కాగా, నరేంద్ర మోడీ 9 గంటల 9 నిమిషాల పిలుపుపై అనేక సందేశాలు వైరల్ అవుతున్నాయి. 9 అంటే నవగ్రహ ఆరాధన ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చని కొందరు చెబుతున్నారు.

ఏప్రిల్ 5.. ఒక అతిపెద్ద సవాలే..
అయితే, మోడీ ఇచ్చిన 9 నిమిషాల పిలుపు మాత్రం భారత విద్యుత్ రంగానికి కొంత మేలు చేయనుంది. మోడీ ఇచ్చిన పిలుపుతో మనదేశంలో ఎంత విద్యుత్ ఆదా అవుతుందనే విషయంపై ఇంజినీర్లు ఇప్పటికే లెక్కలు కట్టడం ప్రారంభించారు. అయితే, ఇంకేదైనా సమస్య కూడా వస్తుందా? అంటే పెద్ద సవాలే ఉందని చెప్పాలి. వేగంగా వెళుతున్న కారును ఒక్కసారిగా ఆపడం, ఆగివున్న కారు ఎక్స్లెటర్ను ఒక్కసారిగా పెంచడం చేస్తే అలావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు కోసం తాము రెండ్రోజుల ప్రణాళికలు వేసుకున్నామని తెలిపారు. దేశం మొత్తం ఒకేసారి లైట్లు ఆర్పివేయడమనేది.. విద్యుత్ రంగానికి ఒక అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

దేశం మొత్తం ఒక్కసారిగా లైట్లు ఆర్పివేస్తే..
టాటా పవర్, ఎన్టీపీసీ లాంటి విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్రాలకు విద్యుత్ అందుతుంది. డిమాండ్ కు తగిన విధంగా సప్లై చేయడం అనేది ఒక సవాలే. 15 నిమిషాల చొప్పున 96 టైమ్ బ్లాక్స్ గా ఒక రోజును విభజించుకోవడం జరుగుతుంది. ఎస్ఎల్డీసీ(స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.
48.5, 51.5 హెర్ట్జ్ల మధ్య విద్యుత్ పంపిణీ జరుగుతుంది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఇక ఏప్రిల్ 5న దేశం మొత్తం ఒక్కసారిగా విద్యుత్ లైట్లు ఆర్పివేయడంతో పంపిణీ కూడా పడిపోతుంది. దీంతో లైన్ ట్రిప్ అయి.. బ్లాకౌట్కు దారితీసే ప్రమాదం ఉంది. అయితే, ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే ఇది జరగకుండా చూసుకోవచ్చు.

థర్మల్ కంటే హైడల్ పవర్ బెటర్ ఆప్షన్...
థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ విద్యుత్ అన్నింటి పంపిణీని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. సోలార్ రాత్రి వేళ విద్యుత్ ఉత్పత్తి చేయదు. పవన్ విద్యుత్ ఆగదు. హైడల్, గ్యాస్ ప్లాంట్ విద్యుత్ ను నిలిపివేయవచ్చు. హైడల్, గ్యాస్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించడం పెద్ద కష్టమేమీ కాదని సదరు సీనియర్ ఇంజినీర్ వెల్లడించారు. థర్మల్ ప్లాంట్ అయితే ప్రారంభిచండానికి కొంత సమయం తీసుకుంటుందని తెలిపారు. కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటికే థర్మల్ ప్లాంట్లన్నీ తక్కువ విద్యుత్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఏప్రిల్ 5న వాటిని పూర్తిగా ఆపేయకుండా విద్యుత్ పంపిణీని తగ్గిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి ప్రకటించిన వెంటనే పవర్ జనరేటర్స్, డిస్కమ్స్, ఎస్ఎల్ డీసీలు ఆదివారం కోసం సిద్ధమయ్యేందుకు పనులు ప్రారంభించాయని తెలిపారు.
Recommended Video

ఆ 9 నిమిషాలు ఏం చేయాలంటే..?
ఏప్రిల్ 5న దేశ ప్రజలంతా కేవలం లైట్లను మాత్రమే ఆర్పివేసి.. ఫ్యాన్లు, ఏసీలు ఆపేయకుండా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీధి లైట్లు, పబ్లిక్ ప్లేసుల్లోని లైట్లు ఆర్పివేయకూడదు. కొందరు లైట్లను ఆర్పివేయడం మర్చిపోయేవారు కూడా ఉంటారన్నారు. 9-10 నిమిషాలపాటు ఒకేసారి డిమాండ్ తగ్గిపోతే కొంత సవాలే అయినప్పటికీ ముందస్తు ప్రణాళికతో అధిగమించవచ్చని అన్నారు. ఆ రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలని అన్నారు.












Click it and Unblock the Notifications