చూస్తూ ఊరుకోం: చైనాకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్, త్వరలో ట్రంప్తో భేటీ!
Recommended Video

న్యూఢిల్లీ: తరచూ సరిహద్దు వివాదాలకు తెరలేపుతున్న చైనాపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. తామంతట తాముగా భారత్ ఏ దేశాన్నీ ఆక్రమించుకోవాలని, వారి పరిధిలోకి వెళ్లాలని చూడబోదని మోడీ స్పష్టం చేశారు.
భారత్, చైనా సరిహద్దుల్లో చైనా సైనికులే అత్యుత్సాహం చూపుతున్నారని, భారత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులను కలుపుతూ నిర్వహిస్తున్న తొలి సదస్సును ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందస్సుకు 23దేశాల నుంచి 134మంది పార్లమెంటేరియన్లు హాజరయ్యారు.

మా విధానం ఇది..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. చైనా ప్రారంభించిన ‘వన్ బెల్ట్ వన్ రోడ్' ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ విధానం మానవతా విలువలతో కూడుకుని ఉంటుందే తప్ప, వ్యాపార పరంగా లాభాలు, నష్టాలు బేరీజు వేసుకునేలా ఉండదని చైనాకు స్పష్టం చేశారు.

చైనాకు హెచ్చరిక
ఇరుగుపొరుగు దేశాల అవసరాలను బట్టి తమ నిర్ణయాలు మారుతుంటాయని, వారి వనరులపై తామెన్నడూ కన్నేయబోమని చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేగాక, భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే మాత్రం ఊరుకునేది లేదని ప్రధాని మోడీ ఘాటుగా హెచ్చరించారు.

అంతా మార్చేశాం
గత మూడున్నరేళ్ల కాలంలో ఇండియాను మార్చి చూపించామన్నారు. దేశాభివృద్ధి ఇచ్చిపుచ్చుకునే మోడల్గా ఉండబోదని, ప్రజావసరాలు తీర్చేలా ఉంటుందని మోడీ చెప్పారు. సబ్ కా సాత్-సబ్ కా వికాస్ నినాదంతో భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు.

చైనా కవ్వింపుల నేపథ్యంలో..
గత కొంత కాలంగా చైనా భారత భూ భాగంలోకి వస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సరిహద్దు దాటి డోక్లాంలోకి చైనా బలగాలు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారత బలగాలు కూడా వారికి ధీటుగా జవాబివ్వడంతో చైనా వెనక్కి తగ్గింది. అంతేగాక, గత కొద్ది రోజుల క్రితం అరుణాచల్ప్రదేశ్ను తాము గుర్తించబోమని కూడా వివాదాస్పద ప్రకటన చేసింది. ఇలా తరచూ చైనా వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

త్వరలో ట్రంప్తో మోడీ భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జనవరి చివరి వారంలో స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ నేతలు, ఆర్థిక వేత్తలు హాజరవుతారు. అమెరికా నుంచి ట్రంప్, భారత్ నుంచి మోడీ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. సమావేశాల్లో భాగంగా వీరు ఇరువురు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, దాదాపు 18ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దీనిపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా శాండర్స్ మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ తన అమెరికా ఫస్ట్ ఎజెండాను ప్రపంచ నేతలతో పంచుకునేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సరైన వేదిక అని చెప్పుకొచ్చారు.

97 తర్వాత.. మోడీ కీలక ప్రసంగం
కాగా, ఈ సదస్సు నిమిత్తం ప్రధాని మోడీ జనవరి 22న స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. రెండో రోజుల పాటు మోడీ అక్కడ పర్యటిస్తారు. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు. 1997 తర్వాత ఓ భారత ప్రధాని దావోస్ సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications