మోడీ ఛరిష్మానే ఎన్డీఏ ఎంపీలకు అండ! ఉత్తరాదిలో పెరుగుతున్న ప్రధాని హవా
ఢిల్లీ : మోడీ ఛరిష్మా తగ్గిపోయింది. బీజేపీ పని అయిపోయింది. కొంతకొంత కాలంగా వినిపిస్తున్న వాదనలు ఇవి. ఇందుకు తగ్గట్లేగానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంతంత మాత్రం ప్రభావం చూపడం ఆ వాదనలకు బలం చేకూర్చాయి. అయితే ఉత్తరాదిన మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని, ఈసారి ఎన్నికల్లో అదే ఎన్డీయే నేతలను ఆదుకుంటుందని ఓ సర్వే స్పష్టం చేసింది.
మోడీ ఛరిష్మాపై యాక్సిస్ మై ఇండియా సర్వే
మోడీ ఛరిష్మా, ఎన్డీఏ సిట్టింగ్ ఎంపీల పనితీరుపై యాక్సిస్ - మై ఇండియా సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసింది. దాని ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఎంపీలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పటికీ, మోడీకి మాత్రం బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడైంది. గతంతో పోలిస్తే మోడీ ప్రభ ఏ మాత్రం తగ్గలేదని, అదే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్యపక్షాల ఎంపీలకు కలిసొస్తుందని చెప్పింది.
ఉత్తరాదిలో మోడీకి బ్రహ్మరథం
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ తదితర కీలక రాష్ట్రాల్లో మోడీ పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. ఎన్డీఏ సిట్టింగ్ ఎంపీల విషయంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ.. మోడీ విషయంలో మాత్రం వారు పాజిటివ్గా ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీలపై ఓటర్ల ఆగ్రహం
ఉత్తరాది రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎంపీల విషయంలో ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ విషయంలో బీహార్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా... అక్కడ 66శాతం ప్రజలు ఎంపీల పనితీరు ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. ఇక యూపీలో 62శాతం, మహారాష్ట్రలో 55, గుజరాత్, మధ్యప్రదేశ్లో 52శాతం మంది ఓటర్లు తమ ఎంపీలపై గుర్రుగా ఉన్నారు.
దక్షిణాదిలో కొంత బెటర్
ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే ఉత్తరాది ఎంపీల కన్నా ఇక్కడి వారి పరిస్థితి కాస్త బెటర్గానే ఉంది. అయితే ఛరిష్మా విషయంలో మాత్రం మోడీ బాగా వెనకబడిపోయారు. దక్షిణాదిలో కేరళలో 72శాతం, తమిళనాడులో 68శాతం మంది మోడీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎంపీల పనితీరుపై కేరళలో 47శాతం తమిళనాడులో అత్యధికంగా 76శాతం, కర్నాటకలో 55శాతం మంది ఆగ్రహంతో ఉన్నారు.
ఏపీ, తెలంగాణ ఎంపీల పనితీరు భేష్
తెలుగు రాష్ట్రాల్లో ఎంపీల పనితీరుపై మాత్రం ఓటర్లు సంతృప్తితో ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. తెలంగాణలో 66శాతం, ఆంధ్రప్రదేశ్లో 61శాతం మంది ఓటర్లు సిట్టింగ్ ఎంపీల పనితీరు భేషుగ్గా ఉందని అంటున్నారు. ఇక మోడీ విషయానికొస్తే ఇరు రాష్ట్ర ప్రజల్లో 50శాతం మంది చొప్పున ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.