తాలిబన్కు రష్యా దన్ను: పుతిన్కు మోదీ ఫోన్ -అఫ్గాన్ పై ఇండియా స్టాండ్ మార్పు?
ఇండియాతో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్ లో తాలిబన్ ఆక్రమణ తర్వాత పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించబోనన్న భారత్.. అక్కడ చిక్కుకున్న భారతీయులను వేగంగా స్వదేశానికి తరలిస్తున్నది. అయితే, పక్కలో బల్లెం లాంటి తాలిబన్లతో కేంద్రం చర్చలు జరపాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తుండటం, అఫ్గాన్ సంక్షోభంపై గురువారం నాడు అఖిలపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సదరు అంశాలపై లోతైన దృష్టి సారించారు. అందులో భాగంగా..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఫోన్ చేశారు. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్ లో తలెత్తిన సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగిందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ సైతం ట్విటర్ లో వెల్లడించారు..

పుతిన్ తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో.. ''అఫ్గానిస్థాన్ లో పరిణామాలపై నా మిత్రుడు పుతిన్తో అభిప్రాయాలు పంచుకున్నా. ద్వైపాక్షిక అజెండా, కొవిడ్ పై పోరులో భారత్- రష్యా మధ్య భాగస్వామ్యం గురించి కూడా చర్చించాం. ముఖ్యమైన విషయాలపై ఇరువురూ సంప్రదింపులు జరుపుకోవాలని, చర్చలను కొనసాగించాలని నిర్ణయించాం'' అని తెలిపారు. అంతకుముందు,
తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని ఇండియా ఇదివరకే స్పష్టం చేసినా, రష్యా, చైనా, బ్రిటన్ సహా పెద్ద దేశాలన్నీ సంయమనం పాటిస్తుండటం, తాలిబన్లకు అవకాశం కల్పించడం మంచిదేనని అభిప్రాయపడుతోన్న క్రమంలో భారత్ తన స్టాండ్ ను మార్చుకునే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, రష్యా అధ్యక్షుడితో మాట్లాడటానికి ముందురోజు, భారత ప్రధాని మోదీ జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తోనూ చర్చలు జరిపారు. అఫ్గాన్లో శాంతిభద్రతలు కాపాడటం కీలకమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డట్లు పీఎంవో సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. కాగా,
తాలిబన్ సర్కారును గుర్తించబోమన్న భారత్, ముందుగా ఎంబసీని మూసేసి, ఆపరేషన్ దేవి శక్తి పేరుతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 800కుపైగా మందిని భారత్ కు తరలించారు. వారిలో భారతీయులే కాకుండా అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు. రష్యా మాత్రం అఫ్గాన్ లో తన రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాలిబన్లతో చర్చలకు వీలైన అన్ని మార్గాలను రష్యా తెరిచే ఉంచింది. తాలిబన్ ప్రభుత్వంపై తొందరపడి ఏదో ఒక ప్రకటన చేయబోమని పుతిన్ అన్నట్లు క్రెమ్లిన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటు,
అఫ్గాన్ సంక్షోభంపై ఈనెల 26న కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ లో విదేశాంగ మంత్రి జైశంకర్.. పార్టీల నేతలకు బ్రీఫింగ్ ఇస్తారు. అమెరికా తప్ప మిగతా దేశాలన్నీ అఫ్గాన్ లో తాలిబన్ పాలనకు సూత్రప్రాయ మద్దతు లేదా అంగీకారం తెలుపుతోన్న క్రమంలో భారత్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుండటం కీలకంగా మారింది. అఖిలపక్ష భేటీ తర్వాత అఫ్గాన్ సంక్షోభంపై మోదీ సర్కారు తన విధానాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications