లాక్ డౌన్ ముగించబోతున్నారా? వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో మోదీ కీలక వ్యాఖ్యలు..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్కి ఏప్రిల్ 15న తెరదించబోతున్నట్టు ప్రధాని మోదీ సంకేతాలు పంపించారు. లాక్ డౌన్ ముగింపు తర్వాత జనసామాన్యం పూర్వ స్థితికి వెళ్లేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీని అవలంభించాలన్నారు. దీనిపై మేధోమదనం జరిపి రాష్ట్రాలు కేంద్రానికి సలహాలు,సూచనలు పంపించాల్సిందిగా కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను గమనిస్తుంటే.. పరిస్థితులు అంత ఆశాజనకంగా ఏమీ లేవన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్(రెండోసారి విజృంభించడం) కూడా మొదలైందన్న సంకేతాలిచ్చారు. గురువారం(ఏప్రిల్ 2)న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మోదీ మాట్లాడారు.
Recommended Video

సీఎంలో మోదీ ఏం చెప్పారు..
ఈ విపత్కర సమయంలో వీలైనంత తక్కవ ప్రాణ నష్టం ఉండేలా వైరస్ను కట్టడి చేయడమే భారత్ ముందున్న లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. కాబట్టి రాబోయే కొద్దివారాల్లో కరోనా వైద్య పరీక్షలు,అనుమానితులను గుర్తించడం,ఐసోలేషన్,క్వారెంటైన్ చర్యలు ముమ్మరంగా సాగాలని చెప్పారు. కరోనా పేషెంట్లకు వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో నిత్యావసరాలు,మెడికల్ ఉత్పత్తులు,ఇతరత్రా ముడిసరుకులకు సంబంధించిన సప్లై చైన్ను సరిగా నిర్వహించుకోవాలని సూచించారు.

కరోనా నియంత్రణ చర్యలపై ఏమన్నారు...
యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం, వైరస్ హాట్స్పాట్లను గుర్తించడం, వాటిని మూసివేసి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం ఇప్పుడు అత్యవసరమని మోదీ ముఖ్యమంత్రులతో చెప్పారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కోవిడ్ 19 మన విశ్వాసాలు,నమ్మకాలపై దాడి చేసిందని.. మన జీవన విధానానికి ముప్పు వాటిల్లేలా చేస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్దంలో మత పెద్దలు,సాంఘీక సంక్షేమ సంస్థలన్నింటిని కలుపుకుని.. జిల్లాలు,పట్టణాల స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

రైతుల గురించి ఏం మాట్లాడారు..
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇది పంటలు కోతకొచ్చే కాలం అని మోదీ గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం రైతులకు లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చిందని.. అయితే సోషల్ డిస్టెన్స్పై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ అవసరం అని పేర్కొన్నారు. ధాన్య సేకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(APMC) పైనే ఆధారపడకుండా ఇతర మార్గాలను కూడా ఆలోచించాలని చెప్పారు. వీలైతే ధాన్య సేకరణకు గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వేదికలు ఏర్పాటు చేయాలన్నారు.

ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించాలని..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిల్లో సర్వైలైన్స్ ఆఫీసర్స్ను ఏర్పాటు చేసి.. వారితో సమన్వయంలో ఉండాలన్నారు. కరోనా కేసుల డేటాను గుర్తింపు పొందిన ల్యాబ్స్ నుంచే తీసుకోవాలన్నారు. తద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల్లో సారుప్యత ఉంటుందన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద లబ్దిదారులకు విడుదల చేసే నిధుల కారణంగా బ్యాంకుల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని.. దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాలు ఆయుష్ డాక్టర్లను కూడా ఉపయోగించుకోవాలని.. పారామెడికల్ సిబ్బంది,ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.












Click it and Unblock the Notifications