కరోనా స్థితిగతులపై ప్రధాని మోడీ అత్యున్నత భేటీ: కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడయ్యాయి. ఒమిక్రాన్ వల్లే దేశంలో కోవిడ్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. దేశంలో పలు నగరాల్లో థర్డ్వేవ్ మొదలైందనే భయాందోళనలు మొదలయ్యాయి. కోవిడ్ మరణాలు సంఖ్య అదుపులోనే ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.
లక్షన్నరకు పైగా కొత్త కేసులు..
తాజా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,59,632 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 327 మంది మరణించారు. 40,863 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువ అయ్యాయి. యాక్టివ్ కేసులు 5,90,611గా రికార్డయ్యాయి.
4,83,790 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 10.27 శాతంగా నమోదైంది. రోజువారీ కొత్త కేసులు లక్షన్నరను దాటేయడం.. యాక్టివ్ కేసులు ఆరు లక్షలకు చేరువ కావడం వంటి పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తోన్నాయి.
నాలుగు వేలకు ఒమిక్రాన్..
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకూ అంతు లేకుండా పోయింది. 3,623 ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373, కేరళ-333, గుజరాత్-204, తమిళనాడు-185, హర్యానా-123, తెలంగాణ-123, ఉత్తర ప్రదేశ్-113 పాజిటివ్స్ వెలుగులోకి వచ్చాయి.
పలు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ..
దీన్ని అడ్డుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లను అమలు చేస్తోన్నాయి. శని, ఆదివారాల్లో లాక్డౌన్ను అమలు చేశాయి. ఈ చర్యలు మరింత విస్తృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకట్లా సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలను మరింత బలపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
ప్రధాని అత్యున్నత భేటీ
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్ స్థితిగతులపై దృష్టి సారించారు. కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఇదివరకే భేటీ అయ్యారు. ఇవ్వాళ తాజాగా మరోసారి అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీ ఈ సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ భాయ్ మాండవీయ, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.
కీలక.. కఠిన నిర్ణయాలు..
దేశంలో కొత్త పాజిటివ్ కేసుల వెల్లువ కొనసాగుతోన్న నేపథ్యంలో- ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి భేటీని నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టీ ఈ సమావేశం మీదే నిలిచింది. ఈ సమావేశం తరువాత ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కొత్త ప్రొటోకాల్స్ను జారీ చేసే విషయంపై కఠినంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో..
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్, పంజాబ్లల్లో ఎన్నికల నగారా మోగింది. ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. చివరిదశ మార్చి 7వ తేదీన ముగుస్తుంది. 10న కౌంటింగ్ ఉంటుంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను రూపొందిస్తారని అంటున్నారు. ఎన్నికల ప్రచార విధి విధానాలపైనా ప్రధాని తన సమీక్షలో ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.