మైనార్టీ శాఖను ఎత్తేయబోతున్న మోడీ ! త్వరలో ఆ శాఖలో విలీనం దిశగా..
కేంద్రంలో మైనార్టీ వ్యవహారాలశాఖను త్వరలో తొలగించేందుకు ప్రధాని మోడీ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు హోంవర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ వ్యవహారాలశాఖను తొలగించి దాన్ని ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయ మంత్రిత్వశాఖలో విలీనం చేసేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి.
దేశంలో అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల్ని పరిరక్షించే లక్ష్యంతో 2006లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ప్రత్యేకంగా మైనార్టీ వ్యవహారాలశాఖను నెలకొల్పింది. దీంతో దేశంలోని జనాభాపరంగా తక్కువసంఖ్యలో ఉన్న ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన వ్యవహారాల్ని ఈ శాఖ కిందకు తెచ్చారు. దీంతో ఆయా వర్గాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇతర రూపాల్లో ఊరట లభించింది. ఇప్పుడు ఆ శాఖను తొలగించి దాన్ని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ కిందకు తెస్తే ప్రత్యేకంగా మంత్రి కానీ, సిబ్బంది కానీ ఉండరు. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది మైనార్టీలకు శరాఘాతం కాబోతోంది.
అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే మైనార్టీ వ్యవహారాలశాఖ అమలు చేస్తున్న పథకాలను విలీనం తర్వాత కూడా కొనసాగిస్తామని చెబుతోంది. ప్రస్తుత ఎన్డీయే సర్కార్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా శాఖ అవసరం లేదని భావిస్తోంది. అంతే కాదు యూపీఏ ప్రభుత్వం అప్పట్లో మైనార్టీలను బుజ్జగించేందుకే ఈ శాఖను ఏర్పాటు చేసిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మోడీ సర్కార్ దాన్ని తిరిగి సామాజిక న్యాయశాఖలో భాగంగా డిపార్ట్ మెంట్ మైనార్టీ అఫైర్స్ గా మార్చబోతున్నట్లు చెప్తున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీరుద్దీన్ హుస్సేన్ స్పందిస్తూ దేశంలో మతపరమైన ఏకీకరణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది భాగమేనన్నారు.