శ్రీరామనవమి వేళ- ప్రధాని మోదీ సర్ప్రైజ్: అన్ ప్లాన్డ్, అన్ షెడ్యూల్ విజిట్
న్యూఢిల్లీ: యావత్ దేశం ఇవ్వాళ శ్రీరామ నవమి పండగను జరుపుకొంటోంది. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కన్నులపండవగా సీతారామచంద్రస్వాముల వారి వివాహ వేడుకలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్ప్రైజ్ ఇచ్చారు. దేశ రాజధానిలో నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను సమీక్షించారు. అక్కడి ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బందితో మాట్లాడారు. నిర్మాణ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
నిజానికి- ఇవ్వాళ్టి ప్రధానమంత్రి షెడ్యూల్ లో ఈ కార్యక్రమం లేదు. ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఈ విషయం చివరి నిమిషం వరకు తెలియదు. అప్పటికప్పుడు ఆయన కొత్త పార్లమెంట్ భవనానికి బయలుదేరి వెళ్లారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి అక్కడికి వెళ్లారు. భవనం నలుమూలలా కలియతిరిగారు. లోపలి వైపు అమర్చిన కుర్చీలను దగ్గరుండి పరిశీలించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ- నిర్మాణ స్థలాల్లో భద్రత కోసం కార్మికులు పెట్టుకునే హెల్మెట్ను ధరించి కనిపించారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు ఆ సమయంలో ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనుల్లో తీరిక లేకుండా గడుపుతోన్న కార్మికులను ప్రధాని మోదీ పలకరించారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. అనూహ్యంగా ప్రధాని మోదీ రావడం పట్ల కార్మికులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. నిర్మాణ పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను పరిశీలించారు.
సెంట్రల్ విస్టా పేరుతో దేశ రాజధానిలోని రైజినా హిల్స్ ప్రాంతంలో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ భవనం నిర్మాణ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానుంది. 2019 సెప్టెంబర్ లో ఈ భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 13,450 కోట్ల రూపాయలు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ భవనం నిర్మితమౌతోంది.

గతంలో ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణ వ్యవహారాలు- దేశ అత్యున్నత న్యాయస్థానం గడప కూడా తొక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కాలంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ- సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. అదే సమయంలో పర్యావరణానికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును డిజైన్ చేసిందంటూ విమర్శలు, ఆరోపణలూ వ్యక్తం అయ్యాయి.












Click it and Unblock the Notifications