అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి పాగా వేస్తామని ధీమాగా కనిపించిన కమలనాథులు.. ఈ తరహా ఫలితాలను ఏ మాత్రం కూడా ఊహించలేక పోయారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ గణనీయంగా తగ్గడం కలవరానికి గురి చేస్తోంది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేకపోతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.

పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా..
ఈ పరిణామాల నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సుప్రిమో అమిత్ షా భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. విశ్లేషణ పూర్తయిన అనంతరం పార్టీ పార్లమెంటరీ కమిటీతోనూ సమావేశమౌతారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనున్నారు.

హర్యానాలో ఓటమికి గల కారణాలపై..
హర్యానాలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవన్నది స్పష్టమైంది. జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అనూహ్య ఫలితాలను సాధించడం బీజేపీ నేతలకు కొరుకుడు పడట్లేదు. ఈ ఎన్నికల్లో జేజేపీ మొత్తం 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితంగా- హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. జేజేపీ గెలిచిన 13 స్థానాల్లో అత్యధికం బీజేపీకి చెందినవే. 2014 ఎన్నికల్లో బీజేపీ హస్తగతం చేసుకున్న అధిక స్థానాల్లో ఈ సారి జేజేపీ పాగా వేయడం పార్టీ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఇప్పటికే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నారు బీజేపీ అగ్ర నేతల. దీనిపై పోస్ట్ మార్టమ్ నిర్వహించనున్నారు.

అతి విశ్వాసం కొంప ముంచిందా?.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని పార్టీ అగ్ర నాయకత్వం భావించిందని, అదే కొంప ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ సూపర్ పవర్ గా ఆవిర్భవించిందని, వారిద్దరూ ఏది తలచుకుంటే అది సాధ్యమౌతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైందని, వారిద్దరి ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాల్లో అవలీలగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేస్తామనే ఓ రకమైన నిర్లిప్త భావన పార్టీ శ్రేణుల్లో నెలకొందని, దాని ఫలితంగా- చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తోందని అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు..
మహారాష్ట్రలో గానీ, హర్యానాలో గానీ బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఊదర గొట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఉనికిని కోల్పోతాయని, అసెంబ్లీ స్థానాల్లో మూడొంతుల మేర సీట్లను బీజేపీ, అలయన్స్ పార్టీలు కొల్లగొడతాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి భిన్నంగా ఫలితాలు రావడం బీజేపీ అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేసింది. ఎక్కడ పొరపాటు జరిగాయనే విషయంపై ఆరా తీయబోతున్నాయి. దీనికోసం ఏకంగా మోడీ-షా జోడీ రంగంలోకి దిగింది. హర్యానా, మహారాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జిలతో మంతనాలు సాగించనుంది.

మహారాష్ట్రలో గెలిచినా..
మహారాష్ట్రలో గెలిచినా కూడా కమలనాథుల్లో హర్షాతిరేకాలు ఆశించిన స్థాయిలో వ్యక్తం కావట్లేదు. దీనికి కారణం.. 2014 నాటి ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే.. బీజేపీ నష్టపోవడమే. 2014 ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లను కైవసం చేసుకోగా.. ఈ సారి ఈ సంఖ్య 103కు కాస్త అటూ, ఇటూగా ఉంటోంది. పైగా ఓట్ల శాతం గణనీయంగా క్షీణించింది. తమ హవా ముందు బలాదూర్ అవుతుందనుకున్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి గట్టిపోటీ ఇచ్చింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం బీజేపీ అధిష్ఠానం విజయోత్సవాలను నిర్వహించుకోవడానికి వెనుకాడుతోంది. ప్రతికూల ఫలితాలపై ఆరా తీయాల్సి ఉందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications