ప్రజల స్పందన అద్భుతం: రేడియో స్పీచ్పై మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: తన ‘మన్కీ బాత్' రేడియో ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమని, వారు అందించిన సూచనలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో రెండో దఫా ప్రసంగం వచ్చే ఆదివారం(నవంబర్ 2న) ప్రసారం అవుతుంది.
‘నవంబర్ 2వ తేదీన ప్రసారమయ్యే ‘మన్కీ బాత్' రేడియో ప్రసంగానికి సంబంధించి అందిన అద్భుతమైన వ్యాఖ్యలు, ఆలోచనలు, సుపరిపాలనకు సంబంధించిన సూచనలను చూశాను. వివిధ అంశాలపై మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలు, ఆసక్తికరమైన సమాంతర విషయ ప్రస్తావనలు చూసి ఎంతో సంతోషించాను' అని మోడీ బుధవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
‘‘మై గవ్' ఓపెన్ ఫోరమ్లో మీ ఆలోచనలను నాతో పంచుకుంటూ ఉండండి. నేను వాటిని చదివి నా రేడియో కార్యక్రమం సందర్భంగా వాటిలో కొన్నిటిని ప్రస్తావిస్తూ ఉంటాను' అని మోడీ చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, వ్యవసాయం, నీటిపారుదల అంశాలు, మహిళల సాధికారికత, స్కిల్డ్ ఇండియా లాంటి కార్యక్రమాలపై వచ్చిన పలు వ్యాఖ్యలు, సూచనలను తాను చదవడం జరిగిందని ఆయన చెప్పారు.

కాగా, నవంబర్ 2న ప్రసారమయ్యే కార్యక్రమానికి ముందు తమ మనసులపై ముద్ర వేసిన సుపరిపాలనకు సంబంధించి చేపట్టిన పలు చర్యలపై తమ మనోభావాలను తనతో పంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిరాశా నిస్పృహలను వదిలిపెట్టడం గురించి, దేశ పురోభివృద్ధికోసం నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ నెల ప్రారంభంలో తన మనసులోని అభిప్రాయాలను రేడియో ప్రసంగం ద్వారా ప్రజలతో పంచుకున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రేడియోలో జాతినుద్దేశించి తాను ప్రసంగించడం కొనసాగిస్తానని ప్రకటించినప్పటినుంచి అందుతున్న సలహాలు, సూచనలు చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
రోడ్డు మార్గాన నేపాల్కు మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గం ద్వారా నేపాల్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. నవంబర్ 26, 27 తేదీల్లో జరిగే సార్క్ దేశాల 18వ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. దీంతోపాటు సీతాదేవి జన్మస్థలమైన జనక్పూర్ ధామ్లో రామ్-జానకి మందిరాన్ని, బుద్ధుడి జన్మస్థలం లుంబిని, పవిత్ర పుణ్యక్షేత్రమైన ముక్తినాథ్ను మోడీ సందర్శించనున్నారు. నాలుగురోజులపాటు ఆయన నేపాల్లో ఉంటారు. పాట్నా మీదుగా నేరుగా జనక్పూర్కు రోడ్డు మార్గాన ఆయన వెళ్లవచ్చనే సమచారంతో బిట్టమోడ్ నుంచి అక్కడి వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications