వారణాసిలో శ్రీ శివకుమారస్వామీజీకి ప్రధాని మోడీ సంతాపం, సొంత కొడుకులా చూశారు, జీవితం !
వారణాసి: కర్ణాటకలోని తుమకూరు సమీపంలోని సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ దేశం గర్వించదగిన మహానుభావుడు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శ్రీ శివకుమారస్వామీజీ దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అని, స్వామీజీ లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నామని ప్రధాని మోడీ అన్నారు.
మంగళవారం వారణాసిలో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కార్యక్రమం మొదలైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీకి నివాళులు అర్పించాలని ప్రజలకు మనవి చేసి అనంతరం సంతాపం వ్యక్తం చేశారు.
కొన్ని లక్షల మందికి విధ్య, వైద్యం, ఉచిత భోజనం అందించిన శ్రీ శివకుమారస్వామీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు మనవి చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తలు ప్రపంచానికే ఆదర్శంగా ఉంటారని, స్వామీజీ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని ప్రధాని మోడీ అన్నారు.
తాను సిద్దగంగా మఠంకు వెళ్లిన ప్రతిసారి సొంత కుమారుడిలా శ్రీ శివకుమారస్వామీజీ చూసుకున్నారని, అనేక సార్లు ఆయన ఆశీర్వాదం తీసుకునే అదృష్టం తనకు కలిగిందని, ఎంతో స్నేహంగా ఉండే స్వామీజీ ఇకలేరు అనే విషయం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
శ్రీ శివకుమారస్వామీజీ లేని లోటు ఇక ఎన్నడూ తీరదని ప్రధాని మోడీ అన్నారు. సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన శ్రీ శివకుమారస్వామీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలు సజీవంగా ఉండేలా చూసుకునే భాద్యత మన అందరిమీద ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.