పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు: మోడీ చేతుల మీదుగా ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా(Central Vista) ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ అద్భుత కట్టడం జాతికి అంకితం కానుంది. ఈ మేరకు వివరాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆకాంక్షించింది లోక్సభ సెక్రటేరియట్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించినట్లు తెలిపింది. అంతేగాక, లోక్సభ, రాజ్యసభలోనూ మార్షల్స్కు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్ణయించినట్లు పేర్కొంది.

కాగా, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్పథ్ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్కేవ్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు పూర్తికావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది.
64,500 చదరపు మీటర్ల పరిధిలో నూతన పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు కూడా పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.

అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. పుష్ప అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు సైతం పిలిచినట్లు వివరించాయి. 'పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు' అని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications